ఏలూరు ‘అస్వస్థత’పై పవన్ కళ్యాణ్ స్పందన: అదే కారణమంటూ జనసేనాని ఆందోళన
అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వన్టౌన్ పరిధిలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏలూరులో శనివారం రాత్రి నుంచి వందలాదిమంది ప్రజలు వాంతులు, విరోచనాలు, ఆయాసం, అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోవడం, మూర్ఛపోవడం లాంటి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.
Recommended Video

ఇలా ఎందుకు జరుగుతోంది..?
అయితే ఇలా ఎందుకు జరుగుతోందా? అని తెలియక అంతుచిక్కని వ్యాధిగా ప్రజలు భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క ప్రభుత్వ ఆసుపత్రికే 227 మందికి పైగా చేరారని అధికారిక లెక్కలు చెబుతుంటే ఇంతకంటే ఎక్కువ మందే వివిధ ఆసుపత్రుల్లో ఉన్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయని తన దృష్టికి వచ్చిందన్నారు.

ఏలూరు పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది..
‘ఏలూరులో యుద్ధ ప్రాతిపదికన వైద్య సహాయం అందించాలి. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జనసేన ప్రతినిధులు చెబుతున్న వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోగిని పరీక్షించిన వైద్యులు వ్యాధి ఏమిటో ప్రాథమిక అంచనాకు రాలేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది' అని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

కాలుష్యమే కారణమా?
ఏలూరులో వాయు, జల కాలుష్యాలు పరిమితికి మించి ఉన్నాయని గతంలో జరిగిన అనేక సర్వేలలో వెల్లడయింది. డ్రైనేజి పైపులు, మంచినీటి పైపులు అక్కడక్కడా కలిసిపోయినట్లు అనేకసార్లు మీడియాలో వార్తలు కుడా ప్రచురితమయ్యాయి.ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా చూడవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగంపై ఉందన్నారు పవన్ కళ్యాణ్.

తక్షణ చర్యలు చేపట్టాలి..
‘తక్షణం వైద్య నిపుణులను ఏలూరుకి రప్పించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావలసిన అవసరం వుంది. ఆ దిశగా ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఏలూరు నగరమంతా ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేసే విధంగా యంత్రాంగాన్ని మోహరించాలి. బాధితులకు అండగా వుండవలసిందిగా జనసేన నాయకులు, కార్యకర్తలను కోరుతున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు.












Click it and Unblock the Notifications