kaza toll plaza incident : టోల్ప్లాజా ఘటనపై రేవతి వివరణ- సీసీ ఫుటేజ్కు డిమాండ్
ఏపీలోని గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద ఈ ఉదయం చోటు చేసుకున్న ఘటనపై ఏపీ వడ్డెర కార్పోరేషన్ ఛైర్పర్సన్ రేవతి ఇవాళ సీఎం జగన్కు వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జగన్ను కలిసిన రేవతి ఇందులో తన తప్పేమీ లేదని తెలిపారు. టోల్ ప్లాజా సిబ్బంది తనపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కులాల పేరుతో దూషించారని కూడా ఆమె జగన్కు ఫిర్యాదు చేశారు.
ఇవాళ ఘటనపై స్పందించిన రేవతి ఈ ఉదయం తన తల్లిని అత్యవసర పరిస్ధితుల్లో ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో టోల్ ప్లాజా రద్దీగా ఉండటంతో పక్కనుంచి వెళ్లేందుకు ప్రయత్నించానని, తనకు స్ధానికంగా జారీ చేసే పాస్ కూడా ఉందని, అయినా ఇవేవీ పట్టించుకోకుండా టోల్ సిబ్బంది తన కారును అడ్డగించారని రేవతి ఆరోపించారు. టోల్ ప్లాజా సిబ్బందికి నచ్చజెప్పినా వినిపించుకోకుండా ఎస్టీ అయిన తన డ్రైవర్తో పాటు వడ్డెర కులానికి చెందిన తనను దుర్భాషలాడారని రేవతి ఆరోపించారు. చివరికి తాను కారు నుంచి బయటికి వచ్చి బ్యారికేడ్లు తొలగించుకుని వెళ్లాల్సి వచ్చిందన్నారు.
ఉదయం టోల్ ప్లాజాలో జరిగిన ఘటనలో తమ తప్పును కప్పిపుచ్చేందుకే టోల్ ప్లాజా సిబ్బంది తనను వీడియో తీసి మీడియాకు ఇచ్చారని, అది తెలియని మీడియా తనపై దుష్ప్రచారం చేస్తోందని రేవతి ఆరోపించారు. ఇప్పటికైనా మీడియా నిజానిజాలు తెలుసుకుని వార్తలు ప్రసారం చేయాలన్నారు. ఈ ఘటనలో తప్పెవరిదో తేలాలంటే టోల్ప్లాజా సీసీ టీవీ ఫుటేజ్ను బయటపెట్టాలని రేవతి డిమాండ్ చేశారు. అప్పుడు టోల్ ప్లాజా సిబ్బంది తనతో ప్రవర్తించిన తీరు బయటికి వస్తుందన్నారు. మహిళనని కూడా చూడకుండా తనతో దురుసుగా ప్రవర్తించిన టోల్ ప్లాజా సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు రేవతి వెల్లడించారు.