ఏపీలో కోరానా: గుంటూరులోనే అధికం.. మొత్తం 483 కేసులు.. ఒక్కరోజులో 44 కొత్తవి..
లాక్ డౌన్ సడలింపు దొరికితే ఏకంగా స్థానిక ఎన్నికలే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్-19 కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆరోగ్య శాఖ తాజాగా వెలువరించిన బులిటెన్ ప్రకారం.. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 44 కేసులు వెలుగులోకి వచ్చాయి. తద్వారా మొత్తం కేసుల సంఖ్య 483కు పెరిగింది. అందులో 16 మంది వ్యాధి నుంచి కోలుకోగా, 9మంది ప్రాణాలు కోల్పోయారు. తద్వారా యాక్టివ్ కేసుల సంఖ్య 458గా ఉంది.
రాష్ట్రంలో నమోదైన కొవిడ్-19 కేసుల్లో అధికభాగం గుంటూరు, కర్నూలు జిల్లాలకు చెందినవే కావడం గమనార్హం. మంగళవారం రాత్రి నాటికి గుంటూరులో అత్యధికంగా 114 కేసులు, కర్నూలులో 91 కేసులు రికార్డయ్యాయి. కొత్త కేసులన్నీ మర్కజ్ కు సంబంధించినవేనని తెలుస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో నెల్లూరు(56), కృష్ణా(44),ప్రకాశం(42), కడప(33), పశ్చిమగోదావరి(23), చిత్తూరు (23), అనంతపురం(20), విశాఖపట్నం(20), తూర్పుగోదావరి(17) ఉన్నాయి. విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
కేసుల సంఖ్యతోపాటు మరణాలు కూడా పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. మంగళవారం దాకా మొత్తం 9 మంది చనిపోయినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపురం జిల్లాలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఒకరు, నెల్లూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కరోనా కట్టడి విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి పెరిగింది.