న్యాయమూర్తి తిరస్కరణ... ఉయ్యూరు శ్రీనివాస్ విడుదల
గుంటూరు చంద్రన్న సంక్రాంతి కానులక పంపిణీ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటకు సంబంధించిన నిర్వాహకుడు ఉయ్యూరు శ్రీనివాస్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముగ్గురు మహిళలు మృతి చెందడంతో అతన్ని అరెస్ట్ చేశారు. గుంటూరులో సుదీర్ఘ విచారణ తర్వాత రాత్రి 11.45 గంటల సమయంలో ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి స్పందన ఇంటివద్ద పోలీసులు హాజరుపరిచారు. శ్రీనివాస్ రిమాండ్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఆయన్ను విడుదల చేశారు.

విజయవాడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
కానుకల పంపిణీకి పటిష్టమైన ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యం చేశారిన, వారిపై చర్యలు తీసుకోవాలంటూ మృతుల్లో ఒకరైన గోపిశెట్టి రమాదేవి కుమారుడు నాగరాజు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ ఏలూరురోడ్డులో ఉన్న ఉయ్యూరు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకొని మధ్యాహ్నం 2.00 గంటలకు గుంటూరు సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. రాత్రి 9.00 గంటల వరకు విచారణ కొనసాగింది. వైద్యపరీక్ష నిమిత్తం 9.15 గంటలకు గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం శ్యామలానగర్ లోని ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి స్పందన ఇంటివద్ద హాజరుపరిచారు.

రాజకీయ ఒత్తిడితోనే కేసు నమోదు
పంపిణీ సందర్భంగా అక్కడకు వచ్చినవారు మరణిస్తారని తెలిసీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. శ్రీనివాస్ తరఫున సీనియర్ న్యాయవాదులు కె.ఎం.కృష్ణారెడ్డి, డి.కోటేశ్వరరావు వాదనలు వినిపించారు. కష్టపడి చదువుకొని అమెరికాకు వెళ్లి తన సొంత డబ్బులతో మాతృభూమికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని, పోలీసులు కూడా అనుమతించారని కోర్టుకు తెలిపారు. పోలీసులు కూడా బందోబస్తులో ఉన్నారని, అయినా మహిళలు చొచ్చుకురావడంతో ఈ దుర్ఘటన జరిగిందని, ఇందులో శ్రీనివాస్ కు ఎటువంటి దురుద్దేశం లేదని, కేవలం రాజకీయ ఒత్తిడితోనే కేసు నమోదు చేశారని వివరించారు.

ఒంటిగంటకు విడుదల
పోలీసులు ఇలా చేయడంవల్ల సమాజ సేవ చేయడానికి ఎవరూ ముందుకు రారని, రిమాండ్ ను తిరస్కరించాలని న్యాయమూర్తిని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం రిమాండ్ ను తిరస్కరిస్తున్నట్లు, శ్రీనివాస్ ను డిశ్చార్జి చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. రాత్రి ఒంటిగంట సమయంలో పోలీసులు ఉయ్యూరు శ్రీనివాస్ ను విడుదల చేశారు.












Click it and Unblock the Notifications