'స్పందన' వేదికగా... వీఆర్వోతో, మహిళా రైతు ఇచ్చిన లంచం డబ్బులు తిరిగి ఇప్పించిన ఎమ్మెల్యే నంబూరి
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, వాటిని పరిష్కరించే దిశగా పని చేసేందుకు జగన్ ప్రభుత్వం చేపట్టిన స్పందన కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన వస్తుంది. ప్రజలు తమ సమస్యను నేరుగా ప్రజా ప్రతినిధుల దగ్గరకు తీసుకువస్తున్నారు. ఇక ప్రజా ప్రతినిధులు ఆ సమస్యలకు అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపించాలి . ఇక ఒక మంచి ఉద్దేశంతో ప్రజల వద్దకే పాలన తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ప్రారంభించిన స్పందన కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఇక ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు స్పందించిన తీరు మాత్రం స్థానికంగా హాట్ టాపిక్ అయ్యింది.
శాంతిపురంలో... అశాంతి రేపిన టీడీపీ,వైసీపీ బ్యానర్ల వివాదం..! బాబు పర్యటన నేపథ్యంలో వెడెక్కిన కుప్పం
మహిళా రైతు నుండి 50వేలు లంచం తీసుకోని పని చెయ్యని వీఆర్ఓ .. స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరికి ఫిర్యాదు
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం తహసిల్దార్ కార్యాలయం దగ్గర జరిగిన స్పందన కార్యక్రమంలో పొలం విషయలో ఓ మహిళా రైతు నుంచి వీఆర్వో లంచం తీసుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లంచం తీసుకుని కూడా తనను నానా తిప్పలు పెడుతున్న వీఆర్వో పై మహిళా రైతు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసింది. అచ్చంపేట మండలం పెదపాలెం రెవెన్యూ అధికారి పుల్లారావు కు రామకోటమ్మ అనే మహిళా రైతు ఎకరం పొలం ఆన్లైన్ విషయంలో రూ.50వేలు లంచం ఇచ్చింది . లంచం తీసుకుని కూడా పని చేయడం లేదని, అతని చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయామని ఆ మహిళా రైతు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నంబూరి.. రెవెన్యూ అధికారి పుల్లారావుని పిలిపించారు. లంచం తీసుకున్నారా అని అడిగితే కాసేపు నీళ్ళు నమిలిన అధికారి చివరకు అవునని అంగీకరించారు.
వీఆర్వో కు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా లంచం డబ్బు ఇచ్చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే
ఇక ఆ అధికారి సమాధానంతో ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. వెంటనే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా లంచం డబ్బు వెనక్కి ఇచ్చేయాలని రెవెన్యూ అధికారిని ఆదేశించారు. లంచం తీసుకోవడం నేరం అని ఎమ్మెల్యే అన్నారు. లంచం తీసుకోవడమే కాకుండా, ఏడాది పాటు మహిళా రైతును ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటారా అని వీఆర్వోపై ఎమ్మెల్యే నంబూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్వోపై ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ దీనిపై విచారణ చేపట్టారు. ఇక వీఆర్వో లంచం తీసుకున్నారన్న దానిపై నివేదిక అందాక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. లంచం తీసుకున్నట్టు రుజువైతే వీఆర్వోని విధుల నుంచి సస్పెండ్ చేయడం లేదా ట్రాన్స్ ఫర్ చేయడం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
లంచం తీసుకుంటే తనకు చెప్పాలని నియోజకవర్గ వాసులకు చెప్పిన ఎమ్మెల్యే
ఇకపై తన నియోజకవర్గంలోనే కాదు , రాష్ట్రంలో కూడా ఎక్కడా ,ఎవరూ తమ పనుల కోసం అధికారులకు లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే నంబూరి స్పష్టం చేశారు. ఇక తమ నియోజకవర్గంలో ఒక వేళ ఎవరైనా లంచం అడిగితే తనకు చెప్పాలని అన్నారు. లంచం డబ్బు వెనక్కి ఇప్పించిన ఎమ్మెల్యే నంబూరిని స్థానికులు ప్రశంసించారు. స్పందన కార్యక్రమంపైనా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి స్పందన కార్యక్రమం ఒక మహిళా రైతుకు మేలు చేసింది అని స్థానికులు చర్చించుకుంటున్నారు.