చంద్రబాబుకు సిఐడీ నోటీసుల వెనుక ఉంది ఎమ్మెల్యే ఆర్కే .. ఆ ఫిర్యాదు మేరకే నోటీసులు
రాజధాని అమరావతి భూముల అక్రమాల విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును, టిడిపి నేతలను వైసీపీ సర్కార్ వదిలేలా లేదు. గతంలో టిడిపి హయాంలో రాజధాని భూములలో అక్రమాలు జరిగాయని వైసీపీ ప్రభుత్వం రాజధాని భూముల అక్రమాలపై కేసును ఏపీ సిఐడికి అప్పగించింది. అప్పటి నుంచి ఏపీ సీఐడీ అధికారులు రాజధాని భూముల అక్రమాలపై కూపీ లాగుతున్నారు . టిడిపి నేతలను ఇరకాటం లో పెడుతున్నారు.
తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ సి ఐ డి నోటీసులు జారీ చేయడానికి మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు కారణంగా తెలుస్తోంది.

చంద్రబాబును ఇరకాటంలో పెట్టటంలో ఎమ్మెల్యే ఆర్కే అందెవేసిన చెయ్యి
మొదటి నుంచి చంద్రబాబు పై కేసుల మీద కేసులు పెడుతూ ఇరకాటంలో పెట్టడంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా టిడిపి మంత్రులపై, ప్రభుత్వం పై ఎక్కువ కేసులు వేసిన వ్యక్తి, చంద్రబాబుకు ముచ్చెమటలు పోయించిన వ్యక్తి ఆర్కే నే కావడం గమనార్హం . ఇక తాజాగా మరోమారు ఏపీ రాజధానిలో భూముల వ్యవహారం తెర మీదకి రావడానికి కారణం కూడా ఆర్కే అని తెలుస్తుంది.

ఫిబ్రవరిలో ఎస్సీ ఎస్టీ భూములను కుట్రలతో లాక్కున్నారని ఫిర్యాదు చేసిన ఆర్కే
గత నెలలో కొంతమంది ఎస్సీ, ఎస్టీ రైతులు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ని కలిసి రాజధాని అమరావతి లో భూములపై ఫిర్యాదు చేశారు . ఆ తర్వాత గత నెల 24వ తేదీన ఎమ్మెల్యే ఆర్కే ఇదే విషయంపై ఏపీ సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ రైతులను బెదిరించి కుట్రలతో భూములను లాక్కున్నారని ఆ ఫిర్యాదులో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పరిహారం కూడా ఇవ్వకుండా అసైన్డ్ భూములను ప్రభుత్వమే తీసుకున్నదని, బెదిరించి లాక్కుందని ఆర్కే తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆర్కే ఫిర్యాదుతో రంగంలోకి ఏపీ సిఐడీ అధికారులు , చంద్రబాబుకు నోటీసులు
మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ సూర్య భాస్కర్ రావు నేతృత్వంలోని బృందం ఆర్ కె ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించి ఈనెల 12వ తేదీన దర్యాప్తుకు సంబంధించిన నివేదికను అధికారులకు అందించారు. దీంతో నివేదిక ఆధారంగా కేసు నమోదు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆర్కే ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజధాని భూముల వ్యవహారంలో రంగంలోకి దిగిన అధికారులు చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తో పాటుగా మరో పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

రాజధాని భూ కుంభకోణం మరోమారు వెలుగులోకి .. మళ్ళీ మొదలైన రచ్చ
ఈ మేరకు
నేడు సిఐడి అధికారులు చంద్రబాబునాయుడుకు విచారణకు హాజరు కావాలని నోటీసులను జారీ చేశారు. దీనిపై చంద్రబాబు న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. . ఆర్కే ఫిర్యాదుతో మరోమారు రాజధాని భూముల కుంభకోణం కేసుల్లో కదలిక వచ్చినట్టు కనిపిస్తుంది . అయితే ఇదంతా కక్ష సాధింపు చర్య అని , కోర్టు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని కేసులను కొట్టేసినా కూడా కావాలనే వైసీపీ సర్కార్ ఇదంతా చేస్తుందన్న ఆరోపణలు వెల్లువగా మారాయి .












Click it and Unblock the Notifications