ఇక ప్రచార బరిలో! పానకాల స్వామిని దర్శించుకున్న నారా లోకేష్..!
మంగళగిరి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల ప్రచారబరిలో దిగారు. పోలింగ్ కు నెలరోజుల కూడా లేకపోవడంతో.. ఆయన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. తొలిదశలో ఆయన మంగళగిరి మండల పరిధిలోని గ్రామాల్లో పర్యటించనున్నారు. ప్రచారాన్ని ఆరంభించడానికి ముందు ఆయన శుక్రవారం ఉదయం పానకాల స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. లోకేష్ కు మంగళగిరి అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ సహా పలువురు పార్టీ నాయకులు ఆయనను సన్మానించారు. లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో దిగడం ఇదే తొలిసారి. దీనితో ఆయన గెలుపును పార్టీ నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
వివేకాది సహజ మరణం కాదా: రక్తపు మడుగులో మృతదేహం: పోలీసులకు ఫిర్యాదు..!
మంగళగిరే ఎందుకు?
పలు నియోజకవర్గాల పరిశీలన, వడపోతల అనంతరం నారా లోకేష్.. మంగళగిరి స్థానాన్ని ఎంచుకున్న విషయం తెలిసిందే. రాజధాని అమరావతి ప్రాంతంలో ఉండటం లోకేష్ కు కలిసి వచ్చే అంశమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదివరకు పెదకూరపాడు, పెనమలూరు, భీమిలి, విశాఖ నార్త్ నియోజకవర్గాల్లో లోకేష్ పోటీ చేస్తారంటూ లీకులు వెలువడ్డాయి. వాటిల్లో ఏ ఒక్క స్థానం నుంచి కూడా పెద్దగా పాజిటివ్ బజ్ రాలేదు. దీనితో- మంగళగిరి స్థానంపై కన్నేశారు. అమరావతి పరిధిలో ఉన్న మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. రాజధానిని నిర్మిస్తున్నామని ప్రచారం చేసుకోవడానికి వీలుగా ఉంటుందని అంచనా వేశారు పార్టీ నాయకులు.
అన్ని పార్టీలనూ ఆదరించిన స్థానం ఇది..
మంగళగిరి నియోజకవర్గం ఒకింత వైవిధ్యంతో కూడుకుని ఉన్నది. నాలుగు పార్టీలను ఈ నియోజకవర్గం ఆదరించింది. కమ్యూనిస్టులు కూడా పలుమార్లు ఈ నియోజకవర్గంపై తమ ఎర్రజెండాను పాతారు. తెలుగుదేశం పార్టీ రెండుసార్లు మాత్రమే ఈ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోగలిగింది. కాంగ్రెస్ ఆరుసార్లు, సీపీఐ మూడుసార్లు, సీపీఎం ఒక్కసారి ఈ నియోజకవర్గంలో గెలుపు రుచి చూశాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది.
కమ్యూనిస్టులు ప్రభావం చూపుతారా?
2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇక్కడ విజయం సాధించారు. ఆయన 12 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సీపీఐ, సీపీఎం పార్టీల అభ్యర్థులకు పడ్డ ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే.. వైఎస్ఆర్ సీపీ, టీడీపీల కంటే ఎక్కువ ఓట్లను సాధించడం విశేషం. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే.. కమ్యూనిస్టుల సంప్రదాయ ఓటు బ్యాంకు ఈ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019