జయము జయము చంద్రన్నకు కౌంటర్: జగన్ నామ స్మరణ..భజన: వికృతానందంలో: నారా లోకేష్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా సభలో ప్రదర్శించిన వీడియో పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు భగ్గుమంటున్నారు. రాజకీయాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడిని అవమానపరిచేలా వ్యవహరించారని, ఇది సభా సంప్రదాయాలకు విరుద్ధమంటూ మండిపడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత సీనియర్గా, 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును ఉద్దేశించి.. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు, విమర్శలు సరికాదని తప్పుపడుతున్నారు.

సభలో జయము జయము చంద్రన్న వీడియో..
రాష్ట్రానికి గుండెకాయగా భావిస్తోన్న పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా వాగ్యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున నిధులను దుర్వినియోగం చేశారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును తానే కట్టినట్టుగా చంద్రబాబు చెప్పుకొంటున్నారని, అది సరికాదని అన్నారు. ఇందులో భాగంగా.. చంద్రబాబును కీర్తిస్తూ పోలవరం ప్రాజెక్టు వద్ద కొందరు మహిళలు `జయము జయము చంద్రన్న..`అంటూ భజన చేసిన వీడియోను ప్రదర్శించారు.
వైఎస్ జగన్కు కౌంటర్..
దీనికోసం 83 లక్షల రూపాయలను చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసిందని విమర్శించారు. ఈ వీడియోకు తెలుగుదేశం పార్టీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. వైఎస్ జగన్పై ఎదురుదాడికి దిగారు. వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేసిన సందర్భాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు వైఎస్ జగన్ నామస్మరణ చేస్తోన్నవీడియోను సోషల్ మీడియాలో వైరల్గా చేశారు.

జగనన్నకు వందనాలో..
ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కొందరు మహిళలు.. గుంపుగా ఓ చోట కూర్చుని వైఎస్ జగన్ పేరుతో భజన చేయడం ఈ వీడియోలో రికార్డయి ఉంది. `జగనన్నకు వందనాలో..` అనే పాటను వారు పాడారు. ఈ వీడియోను కేంద్రబిందువుగా చేసుకుని నారా లోకేష్.. వైఎస్ జగన్పై ఘాటు విమర్శలతో చెలరేగిపోయారు. ఆయనను మూర్ఖుడిగా అభివర్ణించారు. వైఎస్ జగన్లో మూర్ఖత్వం మూర్తీభవించిందని మండిపడ్డారు. రాష్ట్ర పరిపాలనను గాలికి వదిలేశారని, ప్రచారానికి నిధులను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
Recommended Video

ప్రచారం కోసం ప్రజాధనం దుర్వినియోగం..
కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తన ప్రచార కోసం వాడుకుంటున్నారని నారా లోకేష్ ఆరోపించారు. మహిళలతో తన భజన చేయించుకుంటూ వైఎస్ జగన్ వికృతానందాన్ని పొందుతున్నారని నారా లోకేష్ నిప్పులు చెరిగారు. అలాంటి నాయకుడు..చంద్రబాబును విమర్శించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. మూర్ఖుల పరిపాలన ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది నిదర్శనమని ధ్వజమెత్తారు. తాను చేసిన తప్పులను రాజకీయ ప్రత్యర్థులపై నెట్టడం వైఎస్ జగన్కు అలవాటేనని చురకలు అంటించారు. పోలవరం ప్రాజెక్టు 70 మేర పనులు తమ ప్రభుత్వ హాయంలో పూర్తయ్యాయని పునరుద్ఘాటించారు.












Click it and Unblock the Notifications