గుంటూరు జిల్లాలో జనసేనకు 2 నియోజకవర్గాలు ఖరారు?
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన పొత్తు పెట్టుకొని పోటీచేస్తాయా? లేదా? అనే విషయంలో రాజకీయవర్గాల్లో స్పష్టత లేదు. కానీ పరిణామాలు చూస్తుంటే మాత్రం ఈ రెండు పార్టీలు పొత్తుతో వెళ్లడం ఖాయమనిపిస్తోంది. ప్రధానమంత్రి మోడీని కలిసిన తర్వాత తనకు కూడా ఒక్క అవకాశం ఇవ్వాలని కోరిన పవన్ కల్యాణ్ వెంటనే యూటర్న్ తీసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని, అవసరమైతే పొత్తులతో ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమని ప్రకటించారు.

గత ఎన్నికల్లో 29వేల ఓట్లు సాధించిన నాదెండ్ల
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ తరఫున తెనాలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడంతోపాటు డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా ఆయన జనసేనలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీలో నెంబర్ టూ స్థానంలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2004, 2009 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన నాదెండ్ల గత ఎన్నికల్లో జనసేన తరఫున 29వేలకు పైగా ఓట్లు సాధించారు.

తనకేమీ తెనాలి రాసివ్వలేదన్న ఆలపాటి
ప్రస్తుతం టీడీపీ-జనసేన పొత్తుతో వెళ్లాలనుకుంటున్న తరుణంలో తెలుగుదేశం తరఫున తెనాలి ఇన్ఛార్జిగా ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ నిర్వేదాన్ని వ్యక్తం చేశారు. తమనేత చంద్రబాబునాయుడు తనకేమీ తెనాలి నియోజకవర్గాన్ని రాసివ్వలేదని, ఆయన ఎక్కడ పోటీచేయమంటే అక్కడ పోటీచేస్తానని ప్రకటించారు. దీంతో పొత్తులో భాగంగా నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీచేయడం ఖాయమైందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అంబటిని ఓడించే లక్ష్యంతో జనసేనాని
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మరో నియోజకవర్గం సత్తెనపల్లి. ఇక్కడి నుంచి మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనసేన పార్టీ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించింది. అంబటి రాంబాబును ఓడించాలనే దృక్పథంతో పవన్ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున మూడు గ్రూపులు పనిచేస్తూ పార్టీ పరువును బజారున పడేశాయి. దీనిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. కోడెల కుమారుడు శివరాం ఒక వర్గంగా, మాజీ ఎమ్మెల్యే చలపతి ఆంజనేయులు ఒకవర్గంగా, తెలుగు యువత నాయకుడు మల్లి మరోవర్గంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇటీవలే సత్తెనపల్లి వచ్చి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు నష్టపరిహారాన్ని అందజేసిన పవన్ అంబటి అవినీతిపై చేసిన వ్యాఖ్యలు సంచలనానికి కారణమయ్యాయి. అంబటిపై పోరు నడిపే విషయంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో వ్యూహాత్మక మౌనం పాటించిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని ఈ రెండు నియోజకవర్గాలు జనసేనకు కేటాయించడం దాదాపు ఖాయమని టీడీపీ వర్గాలంటున్నాయి.












Click it and Unblock the Notifications