అమెరికాలో టెక్కింగ్.. 200 అడుగుల ఎత్తునుంచి పడి తెలుగు టెక్కీ మృతి
గుంటూరు: అమెరికాలో ట్రెక్కింగ్కు వెళ్లి ప్రమాదవశాత్తు తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. గుంటూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గంగూరి శ్రీనాథ్(32)మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీనాథ్ మరణవార్త తెలిసి ఆయన కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాసరావు, రాజశ్రీ దంపతుల కుమార్తె సాయి చరణి, రాజేంద్రనగర్కు చెందిన శ్రీనాథ్కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు కూడా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి మూడేళ్ల కూతురు ఉంది. గతంలో ఫ్లోరిడాలో ఉన్న వీరు ఆరు నెలల క్రితమే అంట్లాటాకు మారారు.
ఈ క్రమంలోనే ఆదివారం సెలవు కావడంతో సరదాగా గడిపేందుకు శ్రీనాథ్ దంపతులు అట్లాంటాలో ట్రెక్కింగ్కు వెళ్లారు. క్లీవ్లెన్స్ మౌంటెన్ హిల్స్లో ఎత్తైన ప్రదేశానికి వెళ్లిన శ్రీనాథ్ ప్రమాదవశాత్తు 200 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డారు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు శ్రీనాథ్.
ఈ సమాచారం అందడంతో శ్రీనాథ్ తల్లిదండ్రులు మల్లేశ్వరి, బాబూరావు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీనాథ్ మృతదేహాన్ని గుంటూరుకు తీసుకువచ్చేందుకు వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉందని మృతుడి మామ సుఖవాసి శ్రీనివాసరావు తెలిపారు.
అమెరికాలో ఉంటున్న గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, గుంటూరుకు చెందిన ప్రవాసాంధ్రులు మల్లిక్ మేదరమెట్ల, అశోక్ కొల్లా, సురేష్ కాకర్ల బాధిత కుటుంబానికి అవసరమైన సహకారం అందిస్తున్నారు. కాగా,యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో శ్రీనాథ్ మాస్టర్స్ చేశారు. శ్రీనాథ్ మిన్నెసోటాలోని ఒక ఫైనాన్షియల్ కంపెనీతో సాఫ్ట్ వేర్ డెవలపర్గా తన వృత్తిని ప్రారంభించారు.