అవి కాదు, ఎగ్జాక్ట్ పోల్స్ చూడండి.. 70 ఏళ్ల వయసులో రిటైరవుతా..! : వెంకయ్య
Recommended Video
గుంటూరు : 70 ఏళ్ల తర్వాత రాజకీయాలను వదిలేయానుకుంటున్నట్లు మనసులో మాట బయటపెట్టారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. 42 ఏళ్ల తర్వాత తాను ఎన్నికల బరిలో లేకుండా ఈసారి ఎన్నికలు జరిగాయని చెప్పుకొచ్చారు. అలా ప్రజలకు దూరమైనప్పటికీ గౌరవప్రదమైన పదవిలో ఉన్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆదివారం (19.05.2019) నాడు గుంటూరు క్లబ్లో జరిగిన ఓ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ప్రజలు ఇచ్చిన విరాళాల సొమ్ముతోనే ఎన్నికల్లో పోటీ చేశామని.. కానీ ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న కొందరు నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎగ్జిట్ పోల్స్ కాదు.. ఎగ్జాక్ట్ పోల్స్ చూడండి
ఆదివారం నాటితో లోక్సభ ఎన్నికల చివరి ఘట్టం ముగుస్తుందన్న వెంకయ్య నాయుడు.. ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురుచూడకుండా, ఎగ్జాక్ట్ పోల్స్ కోసం చూడండంటూ వ్యాఖ్యానించారు. ఇవాళ పరిస్థితి చూసినట్లయితే చట్టసభలు నడిచే తీరు బాధ కలిగిస్తున్నాయని చెప్పుకొచ్చారు. కొందరు నేతలు మాట్లాడే భాష అసభ్యకరంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో తాను ఎన్నికల సమయంలో రోజు 16 సభలకు హాజరయ్యేవాడినని, ఉపరాష్ట్రపతి అయ్యాక అలాంటి అవకాశం లేకుండా పోయిందన్నారు. అయినా ఆ పదవిలో ఉంటూ ప్రజా సేవకు పాటుపడుతున్నానని తెలిపారు.

ఎవరికి ఎవరు శత్రువులు కాదు..!
రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలకు చోటు ఉండకూడదని అభిప్రాయపడ్డ వెంకయ్య నాయుడు.. పరుష పదజాలం మంచిది కాదని హితవు పలికారు. రాజకీయాల్లో ఎవరికి ఎవరు శత్రువులు కాదని గుర్తు చేశారు. ఒకప్పుడు ప్రజలు ఇచ్చిన డబ్బులతోనే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముండేదని.. ప్రస్తుతం పోటీ చేసే అభ్యర్థులు విచ్చలవిడిగా కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. అంతలా ఖర్చు పెట్టి తీరా గెలిచాక ప్రజలకు ఏం న్యాయం చేయగల్గుతారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తున్నారని వాపోయిన వెంకయ్య.. ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపికలో గుణగణాలు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

70 ఏళ్లకు రిటైర్మెంట్.. సమాజ సేవ చేస్తా..!
మారుతున్న రాజకీయ పరిణామాలతో ఇవాళ కులం, మతం, ధనం కీ రోల్ పోషిస్తున్నాయని ఆరోపించారు. మీడియా కూడా వ్యక్తిగత ప్రయోజనాలకు తావివ్వకుండా.. మంచి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తాను డాక్టరేట్ తీసుకోలేదని.. మన దగ్గర డాక్టరేట్లపై పెద్దగా గౌరవం లేదని అభిప్రాయపడ్డారు.
ఉప రాష్ట్రపతిగా తాను పదవీ బాధ్యతలు స్వీకరించే సమయంలో రకరకాల కథనాలు వచ్చాయని.. అయితే ఎవరి అభిప్రాయాలు వారివని, అందులో బాధపడాల్సిందేమీ లేదన్నారు. ఎన్టీఆర్లా ఉండే తన స్వభావం.. రానురాను ఎస్వీఆర్లా మారిందని చెప్పుకొచ్చారు. నిత్యం ప్రజల మధ్య ఉండాలనేది తన ఆకాంక్షని.. వాళ్లు చెప్పేది వినకుంటే తనకు మనశ్శాంతి ఉండదని వ్యాఖ్యానించారు. అదలావుంటే తనకు 70 ఏళ్లు వచ్చాక రాజకీయాలను వదిలేసి.. సమాజా సేవకు అంకితం కావాలనుకుంటున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications