టీడీపీ మహానాడులా తిట్టడం, తొడ గొట్టడం ఉండదు: ప్రజల అంశాలే అజెండా
గుంటూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ప్లీనరీ నిర్వహణ పనుల్లో తలమునకలైంది. ఇప్పటికే మెజారిటీ నియోజకవర్గాల్లో ప్లీనరీలు ముగిశాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జులై 8వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఈ రాష్ట్రస్థాయి ప్లీనరీని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తోన్నాయి. ప్రస్తుతం పార్టీ యంత్రాంగం మొత్తం దీని మీదే దృష్టి పెట్టింది. పార్టీ నాయకులు ఇప్పటికే పలుమార్లు ప్లీనరీ నిర్వహించ తలపెట్టిన ప్రదేశాన్ని పరిశీలించారు.
ప్లీనరీ నిర్వహణపై..
ప్లీనరీ నిర్వహణపై చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఈ ఉదయం ప్లీనరీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఆవిర్భవించిన తరువాత వైఎస్ఆర్సీపీ నిర్వహించబోతోన్న మూడో ప్లీనరీ కావడం వల్ల ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని అన్నారు. వర్షం వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి ప్రత్యేకంగా జర్మన్ హ్యాంగర్ను సభా ప్రాంగణంలో నిర్మిస్తోన్నామని చెప్పారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు ప్లీనరీలోనే ఉంటారని అన్నారు.
ముమ్మర ఏర్పాట్లు..
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధన కోసం పార్టీ ఆవిర్భవించిందని, దేశ రాజకీయాల్లో ఓ నవచరిత్రను సృష్టించే విధంగా అధికారంలోకి వచ్చిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి మూడు సంవత్సరాల్లోనే 95 శాతం హామీలను అమలు చేశామని పేర్కొన్నారు. భారీ ఎత్తున ప్లీనరీ సమావేశాలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
లక్షలాది మంది..
రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు తరలి రాబోతోన్నారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించనున్నట్లు వివరించారు. వైఎస్ఆర్సీపీ పరిపాలనలో రాష్ట్రం ఎలా ఉండబోతోందనే విషయాన్ని ఈ ప్లీనరీ ద్వారా ప్రజలకు వివరిస్తామని అన్నారు. దీనిపై కొన్ని కీలక తీర్మానాలను ప్లీనరీలో ఆమోదిస్తామని చెప్పారు. రాజకీయ తీర్మానాలు ఉంటాయని పేర్కొన్నారు.
టీడీపీ అజెండా.. తిట్టడమే..
2017లో నిర్వహించిన ప్లీనరీలో పార్టీ అజెండాను ఏమిటనేది ప్రజలకు వివరించామని, ఈ సారి- పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఏం చేశాం, మున్ముందు ఏం చేయాలి.. అనే విషయాలపై చర్చిస్తామని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. అధికార పార్టీని దూషించడానికే తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహించిందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల పట్ల టీడీపీకి ఎలాంటి గౌరవం ఉందో మహానాడుతోనే తేలిపోయిందని విమర్శించారు. దీనికి భిన్నంగా వైసీపీ ప్లీనరీ ఉంటుందని చెప్పారు.
డెలివరీ మెకానిజంపై..
ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, సంక్షేమ పథకాల అమలును ఇంకా ఎలా వేగవంతం చేయాలి? వాటిని మరింతగా ప్రజలకు ఎలా చేరువగా తీసుకెళ్లాలి?, డెలివరీ మెకానిజంలో ఉండే లోపాలను సరిదిద్దుకోవడానికి తాము ప్రాధాన్యత ఇస్తామని శ్రీకాంత్ రెడ్డి వివరించారు. రాజకీయాలంటే ఎన్నికలు మాత్రమే కాదని అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల్లోనే 95 శాతం హామీలను అమలు చేయడాన్ని టీడీపీ భరించలేకపోతోందని చెప్పారు.