గురజాలను దందాలకు అడ్డాగా .. మాఫియా రాజ్యంగా మార్చాడు .. ఎమ్మెల్యే కాసుపై యరపతినేని తీవ్ర వ్యాఖ్యలు
గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు . గురజాల నియోజకవర్గాన్ని మాఫియా రాజ్యంగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మార్చాడని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపణలు గుప్పించారు . ఎమ్మెల్యే గురజాలలో అక్రమ వ్యాపారాలకు తెరతీశారని , ఆయన అనుచరులు అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు .
ఎమ్మెల్యే తన సొంత మనుషులతో మద్యం అక్రమ రవాణా చేస్తున్నారన్నారు. దాచేపల్లిలో మద్యం రవాణా చేస్తూ నిన్న పట్టుబడిన వ్యక్తి కాసు వ్యక్తిగత ఫోటో గ్రాఫర్ అని ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు యరపతినేని . కరోనాలో కూడా కోట్లాది రూపాయల బ్లీచింగ్ స్కాంకు పాల్పడ్డారన్నారు. ఇక ఈ సమయంలో కూడా అందిన కాడికి దండుకుంటున్నారని ఆయన విమర్శించారు. నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు, వ్యభిచార గృహాలను కూడా నడుపుతున్నారన్నారు.

మైనారిటీ బాలికలపై కాసు అనుచరులు అత్యాచారాలకు పాల్పడ్డారని యరపతినేని ఆరోపించారు. ఇక ఇది అని అన్నది లేకుండా అన్ని రకాల దందాలకు, మాఫియాలకు గురజాలను అడ్డాగా మార్చారని ఆయన పేర్కొన్నారు. పిడుగురాళ్లకు చెందిన డాక్టర్ను కాసు గన్ మెన్, అనుచరులు చిత్రహింసలు పెట్టారని చెప్పారు యరపతినేని . నాటు సారా, గుట్కా, రేషన్ మాఫీయాలతో నియోజకవర్గం భ్రష్టు పట్టిందని విమర్శించారు. అక్రమ మద్యానికి పెద్ద సంఖ్యలో ప్రజలు బలి అయ్యే అవకాశం ఉందన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకోని గురజాల ప్రజలను కాపాడాలని యరపతినేని విజ్ఞప్తి చేశారు. మరి ఇంత తీవ్ర విమర్శలు చేసిన నేపధ్యంలో తాజా ఎమ్మెల్యే ఈ ఆరోపణలపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి .












Click it and Unblock the Notifications