చంద్రబాబు ఆ మాటలు రాయలసీమలో మాట్లాడితే తంతారు : ఎంపీ గోరంట్ల మాధవ్
రాజధాని అమరావతినే కొనసాగించాలని నిరసన ర్యాలీలు ఒకవైపు కొనసాగుతుంటే మరోవైపు మూడు రాజధానులకు మద్దతు ర్యాలీలు కొనసాగిస్తున్నారు వైసీపీ నేతలు . పరిపాలనా వికేంద్రీకరణకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదని వారంటున్నారు. ఏపీలో అధికార వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో గోరంట్ల మాధవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి .
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసుల నుంచి జగన్ మోహన్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటికి వస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రిగా మరెన్నో ఏళ్ల పాటు జగన్ పాలన కొనసాగుతుందని అన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని ఆయన పేర్కొన్నారు. జగన్ పై ఉన్న కేసులను సాకుగా చూపి టీడీపీ నేతలు విమర్శించటం తగదన్నారు. ప్రస్తుతం వై ఎస్ జగన్ నేరస్థుడు కాదని నిందితులు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు .

అంతేకాకుండా, విపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు సాగు, తాగు నీటి కోసం పోరాడుతుంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ కోసం పోరాడుతున్నారని ఆరోపించారు. విజయవాడలో చంద్రబాబు రాజధానిగా అమరావతినే ఉండాలని మాట్లాడుతున్నారని , ఆయన అక్కడ మాట్లాడిన మాటలు రాయలసీమలో మాట్లాడితే తంతారని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా రాయలసీమ వెనుకబడి ఉందన్న గోరంట్ల మాధవ్ జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications