సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇంట్లో నాలుగు మృతదేహాలు: రెండు రోజుల కిందటే: సూసైడ్ నోట్లో..!
హైదరాబాద్: హైదరాబాద్లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో నివసించే సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు గల కారణాలేమిటనేది తెలియరాలేదు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సంఘటనాస్థలం నుంచి ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మృతుల పేర్లు ప్రదీప్, ఆయన భార్య శ్వేత, కుమారులు కల్యాణ్ కృష్ణ, జయకృష్ణ. హస్తినాపురంలోని సంతోషిమాత కాలనీలో నివాసం ఉంటున్నారు. ఐబీఎంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఆయన పని చేస్తున్నారు. ఆయన స్వస్థలం ఇబ్రహీంపట్నం. శనివారం నుంచి ప్రదీప్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఎవరూ కనిపించలేదు. వారికి ఫోన్ చేసినప్పటికీ.. సమాధానం లేదు. అదే సమయంలో- వారి నివాసం నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు ఎల్బీ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులను పగులగొట్టి లోనికి వెళ్లగా.. ప్రదీప్, ఆయన భార్య, ఇద్దరు పిల్లల మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించారు. మృతదేహాలు పడి ఉన్న తీరును బట్టి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రదీప్..మొదట తన భార్య, పిల్లలకు పురుగుల మందును ఇచ్చి, అనంతరం ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.
నలుగురి మృతదేహాలను పోస్ట్మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలం నుంచి ప్రదీప్ రాసినట్టుగా భావిస్తోన్న ఓ ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. సంతోషిమాత కాలనీలో కొత్తగా ఇంటిని నిర్మించుకున్న తరువాత.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తి ఉంటాయని భావిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం, వారిలో ఇద్దరు చిన్నారులు ఉండటం స్థానికులను కలచి వేసింది.