హైదరాబాద్ 'మోస్ట్ వాంటెడ్'.. దొంగగా మారిన బీటెక్ డ్రాపవుట్... ఎట్టకేలకు చిక్కాడు..
అతనో బీటెక్ విద్యార్థి... కానీ చదువు ఒంటబట్టక మధ్యలోనే మానేశాడు... ఆ తర్వాత ఈజీ మనీకి అలవాటుపడి దొంగ అవతారమెత్తాడు. ఒకటి కాదు రెండు కాదు అతనిపై ఏకంగా 42 కేసులు నమోదయ్యాయి. పలుమార్లు అరెస్టయి జైలుకు కూడా వెళ్లొచ్చాడు. అయినా బుద్ది మారలేదు. ఎప్పటిలాగే హైదరాబాద్లోని పలు కాలనీల్లో మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడు. గత కొన్ని నెలలుగా తప్పించుకున్న తిరుగుతున్న అతన్ని ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎట్టకేలకు చిక్కిన మోస్ట్ వాంటెడ్...
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... మోస్ట్ వాంటెడ్ దొంగ నేనావత్ వినోద్ కుమార్ అలియాస్ అఖిలేశ్ను ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ టీమ్ గురువారం(నవంబర్ 6) అరెస్ట్ చేసింది.అతనితో పాటు కాట్రావత్ రాజేశ్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరు గత ఏడాది కాలంగా 8 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. వీరి వద్ద నుంచి రూ.17లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు,రూ.1,25,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.

బీటెక్ డ్రాపవుట్..
వినోద్,రాజేశ్తో పాటు షకీల్ అనే మరో వ్యక్తి కూడా దొంగతనాల్లో పాలుపంచుకున్నాడని అంజనీ కుమార్ తెలిపారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని,పోలీస్ బృందాలు అతని కోసం గాలిస్తున్నాయని చెప్పారు. ప్రధాన నిందితుడు రాజేశ్ రంగారెడ్డి జిల్లా ఆమంగల్ మండలం బాలాపూర్కి చెందినవాడని.. బీటెక్ మధ్యలోనే చదువు మానేసిన అతను.. దొంగతనాలకు అలవాటుపడ్డాడని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు వినోద్పై దాదాపు 42 కేసులు నమోదైనట్లు తెలిపారు.

గతంలో 3సార్లు జైలుకు...
గతంలో 2015,2017,2019లలో వినోద్ మూడుసార్లు అరెస్టయి జైలుకు కూడా వెళ్లొచ్చాడన్నారు. ఈ ఏడాది జనవరిలో జైలు నుంచి విడుదలైన వినోద్.. మళ్లీ దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడని చెప్పారు. ఈ ఒక్క ఏడాదిలోనే హైదరాబాద్ పరిధిలోని 8 ఇళ్లల్లో చోరీలు చేశాడన్నారు. కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్న అతనిపై పోలీస్ బృందాలు నిఘా పెట్టాయని... ఎట్టకేలకు టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అనంతరం చార్మినార్ పోలీస్ స్టేషన్లో అతన్ని అప్పగించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications