తెలంగాణలో బీజేపీ కీలక నేతల క్యాంప్ - ఆరెస్సెస్ పెద్దలతో భేటీలు : అమిత్ షా టూర్ ఇలా..!!
మరో ఏడాది కాలంలో తెలంగాణలో జరగనున్న ఎన్నికల పైన బీజేపీ ఫోకస్ పెంచింది. ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ అధినాయకత్వం..ఇందు కోసం బీజేపీ అధినాయకత్వం ఎంపిక చేసిన నేతలను తెలంగాణలో మోహరిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక నుంచే తెలంగాణలో వచ్చే ఎన్నికలకు కసరత్తు - వ్యూహాలు అమలు చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా.. తాజాగా .. బీజేపీ జాతీయ సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ తెలంగాణలో మకాం వేశారు.
బీజేపీ కీలక నేతల మొహరింపు
కొందరు ఆరెస్సెస్ ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సంస్థాగతంగా చేపట్టాల్సిన చర్యలు.. రాష్ట్రంలో రాజకీయాల పైన వారితో చర్చించినట్లు తెలుస్తోంది. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ బాధ్యతలను బన్సాల్ కు అప్పగించనున్నారు. తెలంగాణలో ప్రతీ నెలా పర్యటన ఉండేలా అమిత్ షా స్వయంగా పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ పైన ఆదివారం రాష్ట్రానికి వస్తున్న అమిత్ షా రూట్ మ్యాప్ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో మునుగోడులో బహిరంగ సభలో పాల్గొనేందుకు అమిత్ షా టూర్ షెడ్యూల్ ఖరారైంది. అమిత్ షా ఈ నెల 21న మధ్యాహ్నం మూడున్నర గంటలకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రాయానికి చేరుకుంటారు.
అమిత్ షా మునుగోడు షెడ్యూల్ ఇలా..
అనంతరం అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం నాలుగున్నర గంటలకు మునుగోడుకు చేరకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటుగా మరి కొందరు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతారు. ఆ తరువాత హెలికాఫ్టర్ లో తిరిగి బేగంపేట చేరుకొని ఢిల్లీ బయల్దేరుతారు. అమిత్షా వస్తుండటంతో.. సభకు పెద్దఎత్తున జనాన్ని తీసుకొచ్చేందుకు నేతలు శ్రమిస్తున్నారు. ఇప్పటికే జన సమీకరణ, ఇతర ఏర్పాట్ల కోసం పార్టీ రాష్ట్ర నాయకత్వం.. మండలానికి ఇద్దరు చొప్పున ఇంఛార్జ్లను నియమించింది. సీనియర్ నేతలు అక్కడే మకాం వేశారు. ఈ సభ ద్వారా బీజేపీలో చేరుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సభను విజయవంతం చేయటం వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకున్నారు.
మునుగోడుతో తెలంగాణలో కొత్త సమీకరణం
ఇక, ఈ సభ ద్వారా ఇప్పటి వరకు వ్యక్తిగతంగా ప్రచారం చేస్తున్న రాజగోపాల్..ఇక, బీజేపీ అభ్యర్ధిగా ప్రచారం ప్రారంభించనున్నారు. రేపు టీఆర్ఎస్ బహిరంగ సభకు నిర్ణయించింది. ఆ సభ నిర్వహణ ను టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీంతో..24 గంటల వ్యవధిలో రెండు ప్రధాన పార్టీలు పోటా పోటీగా నిర్వహిస్తున్న బహిరంగ సభలతో మునుగోడులో ఎన్నిక వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పుడు మునుగోడు బై పోల్ భవిష్యత్ తెలంగాణ రాజకీయాలను స్పష్టం చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో.. మునుగోడులో మూడు ప్రధాన పార్టీలు శక్తి చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, బీజేపీ నేతలు రాష్ట్రంలో బలపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు.. కీలక నేతల పర్యటనలు ఎంత వరకు సహకరిస్తాయానేది చూడాల్సి ఉంది.