లేఖాస్త్రం: కేసీఆర్కు బండి సంజయ్ లేఖ, ఏపీ నీరు తరలిస్తోందని..
సీఎం కేసీఆర్కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. ఇటీవల అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించిందని వివరించారు. మెజార్టీ పనులు పూర్తి చేసినట్టు కేంద్రానికి రిపోర్టు సమర్పించిందని తెలిపారు. ఉద్దేశ పూర్వకంగా ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ సీరియస్గా తీసుకోనందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని ఆరోపించారు.
ప్రాజెక్టుతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని బీజేపీ పదిహేను నెలల ముందే హెచ్చరించిందని గుర్తుచేశారు. అపెక్స్ సమావేశానికి హాజరు కాకుండా ఆ తర్వాత మొసలి కన్నీరు కారిస్తే తెలంగాణకు ఏం లాభమని బండి సంజయ్ ప్రశ్నించారు. వైఎస్ జగన్తో కలిసి ప్రజలతో వికృత క్రీడ ఆడుతున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చేందుకే ఇరు రాష్ట్రాల సీఎంలు పనిచేస్తున్నారని మండిపడ్డారు. నిర్లక్ష్యం వల్లే ఏపీ ఈ ప్రాజెక్టును 90శాతం పూర్తిచేసిందన్నారు.
ఏపీ ప్రభుత్వం అక్రమంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మిస్తూ తెలంగాణకు రావాల్సిన నీటిని దోచుకుపోతోందని ఆరోపించారు. ఏపీ దోపిడీని అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నదో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి అక్రమంగా నీటిని తరలించడానికే ఏపీ గత ఏడాదిగా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తున్న విషయం అందరికీ తెలుసన్నారు.
ప్రాజెక్టు వల్ల దక్షిణ తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారుతుందని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా, సీఎం కేసీఆర్ సకాలంలో స్పందించడంలేదని ఆరోపించారు. సీఎంకు పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. తన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి వాస్తవ పరిస్థితిని తెలంగాణ ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. స్వార్థ పూరిత వైఖరితో తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఈ విషయంపై వెంటనే సమాధానం చెప్పాలని లేఖలో బండి సంజయ్ డిమాండ్ చేశారు.