గిరిజనులపై కపట ప్రేమ.. 10 శాతం రిజర్వేషన్ల కోసం తీర్మానం పంపండి: సత్యవతి
తెలంగాణలో రాజకీయాలు ఊపందుకున్నాయి. టీఆర్ఎస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ జరగుతోంది. గిరిజనుల పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ నేతలపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. నరం లేని నాలుక అని అబద్ధాలతో గిరిజనులను మోసం చేయలేరని ఫైరయ్యారు. అగ్రవర్ణాల కొమ్ముకాస్తూ గిరిజన, దళితులను అణచివేస్తూ, వారి రిజర్వేషన్లను కొల్లగొడుతుంది బీజేపీ ప్రభుత్వమని దుయ్యబట్టారు. నిజంగా గిరిజనుల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన దానిని ఆమోదించాలని సవాల్ విసిరారు.
గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలని, మేడారం జాతరను జాతీయ పండగగా గుర్తించాలని కోరారు. కొట్టివేసిన జీవో 3ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే గిరిజనుల ఆత్మగౌరవం పెరిగిందని, అభివృద్ధి జరిగిందని, సంస్కృతి, సంప్రదాయాలు పరిఢవిల్లుతున్నాయని చెప్పారు. గిరిజనుల దీర్ఘకాల డిమాండ్ తండాలను గ్రామ పంచాయతీలు చేసి, గిరిజన ఆవాసాలకు 3 ఫేజ్ కరెంట్ ఇచ్చింది కండ్లకు కనిపిండం లేదా అని ప్రశ్నించారు.
మేడారం జాతరకు గత మూడు దఫాలుగా 300 కోట్లు కేటాయించి, కుమురం భీం, బంజారా భవన్ వంటి ఆత్మగౌరవ భవనాలు నిర్మించారు. సేవాలాల్ జయంతి, కుమురం భీం జయంతిలను అధికారికంగా నిర్వహించి, ప్రతి పండగకు నిధులు కేటాయిస్తూ వాటిని సగౌరవంగా నిర్వహిస్తున్న గొప్ప ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. గిరిజనులకు టీఆర్ఎస్ ప్రభుత్వం, పార్టీలో అన్యాయం జరిగిందని మాట్లాడే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గిరిజనుల చరిత్ర గురించి తెలుసుకొని మాట్లాడితే మంచిదని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ రవీందర్ నాయక్ను అగౌరపరిచిందని బీజేపీ పార్టీ వాళ్లు అంటున్నారు. జనరల్ సీట్ ఇచ్చి ఆయనను ఎంపీ చేసి పార్లమెంట్ కు పంపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గుంట భూమి, సొంత బిల్డింగ్ ఇవ్వకున్నా గత సంవత్సరమే వీసీని నియమించి, ట్రైబల్ యూనివర్సిటీలో తరగతులు నిర్వహిస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఇచ్చినా ఎందుకు నిర్వహిస్తలేరో తెలంగాణ బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతి తండాలో సేవాలాల్ దేవాలయాన్ని నిర్మిస్తామని చెబుతున్నారు. మరి దేశంలో 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్ని దేవాలయాలు కట్టించారో చెప్పాలన్నారు. సేవాలాల్ స్వస్థలం మహారాష్ట్రలో కూడా అధికారంలో ఉండి కట్టించలేదు కదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ గొప్పగా జరుపుతున్నామని వివరించారు. ప్రతి జిల్లా కేంద్రంలో గిరిజన భవనాల కోసం స్థలం కేటాయించి, నిధులను విడుదల చేశాం అని తెలిపారు. ఇవి నిర్మాణంలో ఉన్నాయన్న సంగతి గుర్తిస్తే మంచిదని చురకలంటించారు. ఇవన్నీ చూడకుండా, చెప్పకుండా గిరిజనుల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా అగ్రవర్ణాల కొమ్ముకాసే ఈ బీజేపీకి లేదని ఘాటుగా విమర్శించారు.