మోడీ పేరు చెబితే చలి జ్వరం వచ్చిందా..? కేసీఆర్పై బండి సంజయ్ గుస్సా
హైదరాబాద్ పర్యటనకు ప్రధాని మోడీ వచ్చిన సంగతి తెలిసిందే. బిజీ బిజీగా గడిపారు. అయితే ఆయా కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ కూడా పాల్గొనాల్సి ఉంది. కానీ చివరి క్షణంలో మార్పు జరిగింది. కేసీఆర్ అస్వస్థతకు గురవడంతో.. కార్యక్రమానికి హాజరుకాలేదు. కానీ దీనిపై అప్పుడే రాజకీయ దుమారం రేగింది. ఇటీవల బీజేపీ, మోడీపై విమర్శలు చేస్తోన్న కేసీఆర్.. మోడీతో వేదిక పంచుకోవడం ఇష్టంలేకనే ఇలా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రస్తావించారు.
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ విమానాశ్రయానికి రావాల్సి ఉంది. తనకు జ్వరం వచ్చిందని కేసీఆర్ ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ రాకపోవడంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్కు ఏం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ పేరు చెబితేనే చలి జ్వరం వచ్చిందా? అని ఎద్దేవా చేశారు.
ప్రధాని వస్తే కూడా రాలేనంత కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారా? అని నిలదీశారు. జ్వరం వచ్చిందంటూ సాకులు చెప్పి తప్పించుకోవడం సరికాదని కామెంట్ చేశారు. తెలంగాణ ప్రజలంటే మోడీకి ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయని తెలిపారు. కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా తెలంగాణ ప్రజలపై మమకారంతో మోడీ ఆయనకు అపాయింట్ మెంట్ ఇచ్చేవారని బండి సంజయ్ వెల్లడించారు. ప్రధాని హైదరాబాద్ వస్తే స్వాగతించడానికి కేసీఆర్ రాకపోవడం మంచి పద్దతి కాదన్నారు.
మోడీ పర్యటన సందర్భంగా 8 వేలమంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రధాని భద్రత కారణంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. 15 నెలల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని వచ్చారు. అలా వచ్చిన సమయంలో కేసీఆర్ డుమ్మా కొట్టడంపై విమర్శలు వస్తున్నాయి. 2020 నవంబరు 28న జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో హైదరాబాద్కు వచ్చి జినోమ్వ్యాలీలోని భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాల తయారీ కేంద్రాన్ని మోడీ సందర్శించి వెళ్లారు.