హైదరాబాద్లో చలితోపాటు పెరుగుతున్న కాలుష్యం: ఈ ప్రాంతాల్లో ప్రమాద స్థాయికి
హైదరాబాద్: నగరంలో గత నాలుగైదు రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. అయితే, అదే సమయంలో కాలుష్యం కూడా పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. పెరిగిన చలి ఒకవైపు, మరోవైపు కాలుష్యంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వారాంతాల్లో కాలుష్య మరింత ప్రమాదస్థాయికి చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా నగరంలో తిరిగే లక్షలాది వాహనాల కారణంగానే కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోందని తెలుస్తోంది. పెరుగుతున్న చలి కూడా ఇందుకు తోడవడంతో మరింత ప్రభావం చూపిస్తోంది. దీంతో చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయట తిరిగేవారు శ్వాససంబంధిత వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మలక్పేట, జూపార్క్, సనత్నగర్, సోమాజిగూడ, తదితర ప్రాంతాల్లో గాలి నాణ్యత పడిపోయింది. అత్యధిక గాలి కాలుష్యం మలక్పేట, సనత్నగర్లో నమోదైంది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్న దృష్ట్యా కాలుష్యం మరింతగా పెరుగుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో నగరంలో వాయు, జల, శబ్ధ, కాలుష్యాన్ని తగ్గించేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. పర్యావరణ, శాస్త్రసాంకేతిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్ ఈ మేరకు వెల్లడించారు. హైదరాబాద్ లో కాలుష్యానికి ముఖ్య కారణాలు, నియంత్రణ చర్యలు.. తదితర అంశాలపై ఐఐటీ కాన్పూర్ సమర్పించిన ప్రాథమిక నివేదికను సచివాలయంలో పరిశీలించారు. ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరంలో కాలుష్య నియంత్రణకు వేగవంతమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.












Click it and Unblock the Notifications