సీనియర్లా? కోవర్టులా?: ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిపై అనిల్ సంచలనం
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం సీనియర్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో అనిల్ స్పందించారు.
12 మంది ఎమ్మెల్యేలు పార్టీనప్పుడు ఏమైంది సేవ్ కాంగ్రెస్?
12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డే కారణమని అనిల్ ఆరోపించారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు సేవ్ కాంగ్రెస్ గుర్తుకు రాలేదా? అని సీనియర్ నేతలను ఆయన ప్రశ్నించారు. తనకు టికెట్ దావొద్దని ఆనాడు ఉత్తమ్ ప్రయత్నించారని.. కానీ, ఈ విషయంలో భట్టి విక్రమార్కపట్టుబట్టి టికెట్ ఇప్పించారని తెలిపారు.
కోట్లు ఇవ్వలేదా?: ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అనిల్ సంచలనం
అంతేగాక, గూడూరు నారాయణ రెడ్డిని రాజీనామా చేయించి బీజేపీలోకి పంపించింది ఉత్తమ్ కుమార్ రెడ్డినేనని అనిల్ ఆరోపించారు. కౌశిక్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుమారు రూ. 8 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయడం లేదా? అని ప్రశ్నించారు. 'వర్కింగ్ ప్రెసిడెంట్గా భట్టి ఉన్నప్పుడు.. ఉత్తమ్ పీసీసీ చీఫ్గా ఉండి ఆయన్ని చిన్న చూపు చూడలేదా ? కుల అహంకారం చూపించలేదా ? బీసీల టికెట్లు కోసే ప్రయత్నం ఉత్తమ్ చేయలేదా ? పొన్నాల టికెట్ కట్ చేసే ప్రయత్నం చేసిండు. కౌశిక్ రెడ్డికి టీఅరెఎస్లో ఎమ్మెల్సీ వచ్చేలా చేసింది ఉత్తమ్ కాదా ? సీఎల్పీగా భట్టిని కాకుండా ట్రై చేయలేదా ? దళితున్ని సీఎల్పీ కాకుండా చేసే ప్రయత్నం చేయలేదా ? ఎల్బీ నగర్ టికెట్ కోసం ఓ వ్యక్తిని రూ. 5 కోట్లు అడగలేదా' ? అని ఉత్తమ్ లక్ష్యంగా చేసుకుని అనిల్ సంచలన ఆరోపణలు చేశారు.
రేవంత్ రెడ్డి ఫోన్లో అందుబాటులో ఉండరు.. అంతేతప్ప..
రేవంత్ రెడ్డి ఒక్క ఫోన్లో అందుబాటులో ఉండరని, అది తప్ప ఇంకేమైనా ఉందా? అని అనిల్ నిలదీశారు. టీఆర్ఎస్ సర్కారుపై రేవంత్ పోరాటం చేయడం లేదా? ప్రజా సమస్యలపై ఫైట్ చేయడం లేదా? అని కాంగ్రెస్ సీనియర్ నేతలను అనిల్ ప్రశ్నించారు. జనవరి 26 నుంచి పాదయాత్ర చేయనున్నారని, దీనికి రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తారని చెప్పారు.
మునుగోడులో కోవర్టులా పనిచేసిందెవరు?
'సునీల్ కనుగోలు పార్టీ కోసమే పనిచేస్తున్నారు. పార్టీలోని వ్యక్తులకు వ్యతిరేకంగా కాదు. ఉత్తమ్పై కూడా సునీల్ వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు... సీవీ ఆనంద్ మీకు ఎలా చెప్పారు ? మేముఎలా నమ్మాలి ? మునుగోడులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం పనిచేయాలని అన్నప్పుడు మీరెక్కడ వున్నారు ? బీజేపీకి పనిచేయాలని కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసినప్పుడు మీరెందుకు మాట్లాడలేదు ? మునుగోడులో లోపాయికారి ఒప్పందం చేసుకోలేదా ? దానికి సంబందించిన ఆధారాలు ఉన్నాయి' అని కాంగ్రెస్ సీనియర్లను నిలదీశారు అనిల్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోవర్టు కాదా? అని ప్రశ్నించారు.
టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు పదవులు ఇవ్వద్దా?
వార్ రూమ్పై దాడి జరిగితే రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా పని చేశారని గుర్తు చేశారు. కార్యకర్తలపై 11 వేల కేసులున్నట్లు, పార్టీ కోసం, సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారన్నారు. మీ మీద ఎన్ని కేసులున్నాయి ? పదవులు మీకు, కేసులు క్యాడర్కా..? అని అనిల్ నిలదీశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన స్వార్థం కోసం టీడీపీతో పొత్తు పెట్టుకుంటారని, హుజూర్నగర్లో ఆ పార్టీ పొత్తు పెట్టుకొని ఓడిపోయారని విమర్శించారు. టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు పదవులు వద్దా? అని అనిల్ ప్రశ్నించారు. టీడీపీ నుంచి వచ్చినా కూడా రేవంత్ సహా ఇతర నేతలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారని అన్నారు. అలాంటి నేతలను అవమానించేలా బహిరంగంగా మాట్లాడతారా? అని మండిపడ్డారు. కమిటీల విషయం భట్టి విక్రమార్కకు సమాచారం లేదనడం అవాస్తవమని చెప్పారు.