వరదల కారణంగా టార్గెట్ అయిన కేసీఆర్ ... విరుచుకుపడిన భట్టి విక్రమార్క , జీవన్ రెడ్డి
తెలంగాణ సీఎం కేసీఆర్ వరదల కారణంగా టార్గెట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, రాష్ట్ర రైతాంగానికి తీరని నష్టం జరిగింది. భాగ్యనగరం హైదరాబాద్ ముంపుకు గురైంది. ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ ముంపుకు గురికావడం , తీవ్ర ప్రాణ ,ఆస్తి నష్టం వాటిల్లడం అధికార పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు.

వర్షాలకు రాష్ట్రం వెనిస్ నగరంలా ఉందన్న భట్టి
గతంలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలను ఇప్పుడు గుర్తు చేస్తూ ఇదేనా మీ పాలన అంటూ ప్రశ్నిస్తున్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వర్షాలతో తెలంగాణ రాష్ట్రం వెనిస్ నగరంలా కనిపించిందని పేర్కొన్న ఆయన కెసిఆర్ ఇస్తాంబుల్ , డల్లాస్ నగరంలా హైదరాబాద్ ను చేస్తామన్నారు అని గుర్తు చేశారు. ఇక కేటీఆర్ విశ్వనగరం అని చెప్పుకొచ్చారని భట్టి విక్రమార్క ఇదేనా విశ్వనగరం అంటూ ప్రశ్నించారు.

టీఆర్ఎస్ పార్టీని దూరం పెట్టి నగరాన్ని కాపాడుకోవాలని పిలుపు
72వేల కోట్ల అభివృద్ధి ఎటు పోయిందని సీఎం కేసీఆర్ ను నిలదీశారు. టిఆర్ఎస్ పార్టీని దూరం పెట్టి నగరాన్ని కాపాడుకోవాలని భట్టి విక్రమార్క హైదరాబాద్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. ఆరేళ్లుగా పాలన సాగిస్తున్నా హైదరాబాద్ సమస్యలను కొంచెం కూడా పరిష్కరించలేదని, ప్రస్తుతం ప్రజల ఇబ్బందులకు అధికారపార్టీ నిర్లక్ష్య ధోరణి కారణమని ఆయన విరుచుకుపడ్డారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై నిప్పుల వర్షం కురిపించారు.

హైదరాబాద్ అంతా నాశనమైనా, సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ దాటరా ?
భారీ వర్షాలతో దెబ్బతిన్న వరి, పత్తి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. పంట నష్టంపై రైతువారి సర్వే నిర్వహించాలని పేర్కొన్న జీవన్ రెడ్డి రైతుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని ఆయన మండిపడ్డారు. వరదల కారణంగా హైదరాబాద్ అంతా నాశనమైనా, సీఎం కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ నుంచి బయటకు రాకుండా ఉన్నారని, ఇది అత్యంత దురదృష్టకరమైన విషయమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
Recommended Video

నడవటం చేతకాకుంటే హెలికాఫ్టర్ లో ఏరియల్ సర్వే చెయ్యండన్న జీవన్ రెడ్డి
సీఎం ఇప్పటికైనా కాళ్లు బయటపెట్టాలన్న జీవన్ రెడ్డి నడవడం చేతకాక పోతే కనీసం హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేయాల్సిందిగా పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడుదొంగల్లా తయారయ్యాయని మండిపడ్డ జీవన్ రెడ్డి వర్షాల కారణంగా తడిసి రంగు మారిన వడ్లను కూడా సర్కారు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు . రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వానికి ఇంత నిర్లిప్తత పనికిరాదని జీవన్ రెడ్డి మండిపడ్డారు. తక్షణం నష్టపరిహారం అందించాలని రైతులను, ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications