పోలీసులే టార్గెట్ గా సైబర్ నేరగాళ్ళు .... ఫేస్ బుక్ లో ఫేక్ అకౌంట్లు .. తస్మాత్ జాగ్రత్త !!
తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఫేస్ బుక్ కేంద్రంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులను టార్గెట్ చేసుకుని సైబర్ నేరగాళ్లు దోపిడీకి దిగుతున్నారు. పోలీసుల పేరుతో ఫేక్ అకౌంట్ లను క్రియేట్ చేసి ఆ ఎకౌంట్ల ద్వారా డబ్బు కావాలంటూ మెసేజ్ లు పెట్టి అందినకాడికి దోచుకుంటున్నారు. ఒక్క తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటి వరకు 50మంది పోలీసు అధికారుల పేర్లతో సైబర్ నేరగాళ్ళు ఫేక్ అకౌంట్స్ తెరిచారని ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు అధికారులు .
ఆన్ లైన్ మద్యం డోర్ డెలివరీ పేరుతో సైబర్ నేరగాళ్ళు: మోసపోతున్న మందుబాబులు
సోషల్ మీడియా టార్గెట్ గా సైబర్ నేరగాళ్ళు
సైబర్ నేరగాళ్లు ఇప్పుడు సోషల్ మీడియాని టార్గెట్ చేసుకున్నారు. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం, అధికారుల ఫోటోలు, పేర్లు ఉపయోగించుకోవడం, కొత్త ఖాతాలు తెరవడం చేసి వీటి ఆధారంగా పబ్లిక్ తో చాటింగ్ చేస్తున్నారు. ఇదంతా నిజమని నమ్ముతున్న పబ్లిక్ నిజంగానే తాము సదరు అధికారులతోనే మాట్లాడుతున్నట్లుగా ఫీలవుతూ, వారు ఏదడిగినా చేస్తున్నారు. దీంతో డబ్బు కావాలని రిక్వెస్ట్ పెడుతూ, తమ అకౌంట్లకు డబ్బులను ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు సదరు కేటుగాళ్లు. పోలీసులకు ఇప్పుడు ఈ తరహా నేరాలు తలనొప్పిగా మారాయి.
పోలీసుల పేరుతో మనీ రిక్వెస్ట్ లు .. మోసపోతున్న జనాలు
తమ పేరుతో ఫేక్ అకౌంట్లు వినియోగిస్తూ డబ్బులు దండుకోవడం పోలీసులను టెన్షన్ పెడుతుంది. ఇప్పటికే హైదరాబాద్లోని మూడు కమిషనరేట్లలో ఉన్న అధికారులతో పాటు డీజీపీ కార్యాలయంలో పని చేసే వారి పేరుతోనూ నకిలీ ఖాతాలు తెరిచి సైబర్ నేరగాళ్లు దందా మొదలుపెట్టారు. ఈ మోసాలను గుర్తించని కొందరు వారు అడిగినంత డబ్బులు ఇస్తుంటే, అనుమానం వచ్చిన వారు పోలీసుల దృష్టికి తీసుకు వెళ్తున్నారు. దీంతో దృష్టిసారించిన సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ క్రైమ్స్ విషయంలో తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు.
పోలీసు అధికారుల ఫోటోలు , వారి ప్రొఫైల్ నేమ్స్ తో కొత్త ఖాతాలు
పోలీస్ అధికారులకు చెందిన ఖాతాలను గుర్తించి, ఫోటోలను డౌన్లోడ్ చేసుకుని, ఆ పై అధికారుల ప్రొఫైల్ నేమ్ లు, డౌన్ లోడ్ చేసిన ఫోటోలను వినియోగించి కొత్త అకౌంట్ లను క్రియేట్ చేస్తున్నారు. ఈ కొత్త ఖాతాల నుండి అధికారుల ఫ్రెండ్ రిక్వెస్ట్ లో ఉన్నవారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపించడంతో వారు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత కొత్త ఫ్రెండ్స్ తో చాటింగ్ మొదలు పెట్టి అదును చూసి డబ్బులు అడుగుతున్నారు. 20వేలు , 25వేలు ఇలా డబ్బులు కావాలి అంటూ పంపించమని అడుగుతున్నారు.
అనుమానంతో క్రాస్ చెక్ .. అవాక్కవుతున్న పోలీసులు
కొందరు డబ్బులు పంపిస్తే, కొంతమంది పోలీసు అధికారులు ఇలా ఎందుకు అడుగుతారు అని అనుమానం వచ్చి సదరు పోలీసు అధికారుల కి కాల్ చేసి విషయం చెప్పడంతో అసలు వ్యవహారం బయటకు వస్తోంది. ఈ తరహాలో ఏపీలోని పోలీసు అధికారులను ఇటు తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్ అధికారులను బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్ళు. ఇటీవల మహబూబాబాద్ జిల్లా టౌన్ సీఐ పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా క్రియేట్ చేసిన హాకర్స్ సీఐ రవికుమార్ ఫోటో ఐడీతోనే ఫేస్ బుక్ లో ఉన్న మిత్రులకు డబ్బులు కావాలని మెసేజ్ చేశాడు. అర్జెంట్ అవసరమున్నాయని 15000 కావాలని గూగుల్ పే ద్వారా నైనా ఫోన్ పే ద్వారా నైనా పంపించాలని మెసేజ్ లు చేసినట్టు గుర్తించారు. ఈ విషయం తెలిసిన సీఐ షాక్ అయ్యారు. ఇలాంటి వాటికి రెస్పాండ్ అవ్వద్దు అని సూచించారు.
Recommended Video
ఐపీఎస్ లను వదలనిసైబర్ గ్యాంగ్ .. తస్మాత్ జాగ్రత్త
ఇక తాజాగా ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా పేరుతోనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆమె స్నేహితులు బంధువులు పోలీస్ అధికారులకు డబ్బులు కావాలని మెసేజ్ చేశారు. దీంతో అది ఫేక్ ఖాతా అని తేల్చేశారు . ప్రస్తుతం ఆమె సైబర్ కేటుగాళ్లను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు . తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 మంది పోలీసు అధికారులు పేరిట నకిలీ ఖాతాలు సైబర్ నేరగాళ్ల సృష్టించినట్లుగా సైబరాబాద్ అడిషనల్ డిసిపి కవిత పేర్కొన్నారు. ఒడిస్సా, రాజస్థాన్ నుంచి మోసాలకు పాల్పడుతున్న ట్లుగా ప్రాథమికంగా గుర్తించామని పేర్కొన్నారు. ఇలాంటి అభ్యర్ధనలను నమ్మ వద్దంటూ కోరుతున్నారు.