ముస్లింల మనోభావాలు దెబ్బతీస్తున్నారు.. తమను బీజేపీ ద్వేషిస్తోంది, అల్లర్లకు కుట్ర: అసద్
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్లతో కమళదళం అప్రమత్తమైంది. అతనిని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసింది. అంతకుముందు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ బీజేపీపై విరుచుకుపడ్డారు. ముస్లింలను బీజేపీ ద్వేషిస్తోందని తెలిపారు. అందుకోసమే ఎమ్మెల్యే రాజా సింగ్ ఇలా విరుచుకుపడ్డారని గుర్తుచేశారు. అంతేకాదు బీజేపీ హైదరాబాద్లో అల్లర్లకు కుట్ర పన్నిందని తెలిపారు. కానీ గత 8 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగానే ఉందని చెప్పారు.
ఇటీవల హైదరాబాద్కు మునావర్ ఫరూఖీ వచ్చిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ కూడా ఆ షోకు హాజరయ్యారు. షో నిర్వహించొద్దని రాజా సింగ్ విన్నవించారు. అయినా షో నిర్వహించడంతో వీడియో పోస్ట్ చేశారు. అందులో మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా కామెంట్స్ ఉన్నాయట. ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అసదుద్దీన్ మండిపడ్డారు. నుపూర్ శర్మ చేసిన కామెంట్లకు సంబంధించి వివాదం కొనసాగుతూనే ఉందన్నారు.
వీడియోలో రాజా సింగ్ చేసిన కామెంట్లను ఖండించారు. ఆ వాయిస్ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించాలని కోరారు. హైదరాబాద్లో శాంతియుత వాతావరణం చూడలేకపోతుందని.. దేశాన్ని విచ్చిన్నం చేయాలని అనుకుంటుందని అసద్ మండిపడ్డారు. ముస్లింలను మానసికంగా దెబ్బతీయాలని బీజేపీ అనుకుంటుందని తెలిపారు.
మహ్మద్ ప్రవక్తపై కామెంట్స్ చేసిన నుపూర్ శర్మకు పోలీసులు భద్రత కల్పించడం ఏంటీ అని అడిగారు. రాజా సింగ్ కామెంట్లను ప్రధాని మోడీ సమర్థిస్తారా అని అడిగారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు రాజా సింగ్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో.. బీజేపీ హైకమాండ్ స్పందించింది. అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.