చేపలు పుష్కలంగా తింటే క్యాన్సర్ రాదంట.. చెప్పిందెవరో తెలుసా..!
హైదరాబాద్ : క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధిలా మారుతోంది. సైలెంట్ కిల్లర్గా మనుషుల ప్రాణాలు హరిస్తోంది. క్యాన్సర్ వ్యాధి పట్ల జనాల్లో అవగాహన లేకపోవడం కూడా ఆ వ్యాధి ముదరడానికి కారణమవుతోంది. ప్రజల నిర్లక్ష్యంతోనే క్యాన్సర్ విజృంభిస్తోందనే వాదనలు కూడా లేకపోలేదు. దాని వల్ల మరణాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. 80 శాతం మంది క్యాన్సర్ బాధితులు క్రిటికల్ స్టేజ్ వచ్చేంతవరకు డాక్టర్ ని కన్సల్ట్ చేయకపోవడంతోనే మరణిస్తున్నారనేది ఒక నివేదిక సారాంశం.
అయితే ముందు జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ మహామ్మరిని తరిమికొట్టొచ్చని ప్రూవ్ చేస్తోంది ఓ పరిశోధన. చేప మాంసం ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ జబ్బు రాకుండా నిరోధించవచ్చని సూచిస్తోంది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని క్యాన్సర్ రీసెర్చి సెంటర్లో చేసిన పరిశోధనలో భాగంగా ఈ విషయం వెల్లడైంది.
ముఖేశ్ గౌడ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు.. కడసారిగా చూసి అభిమానుల కన్నీరు
చేపమాంసాన్ని రెగ్యులర్గా తీసుకుంటే పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా ఉంటుందని ఆ నివేదికలో వివరించారు. వారంలో దాదాపు మూడుసార్లు చేపలు తింటే క్యాన్సర్ కారకాలు దరి చేరకుండా నిరోధించవచ్చని సూచిస్తున్నారు. 4 లక్షల 76 వేల 160 మందిపై జరిపిన పరిశోధనల తాలూకు ఫైనల్ రిపోర్టుగా ఈ అంశం బయటపెట్టారు.
చేప మాంసంలో ఓమేగా - 3 ఆమ్లాలు మానవ శరీరంలో కీలకపాత్ర పోషిస్తాయి. అంతేకాదు వాటిలో అధికంగా ఉండే పోషక పదార్థాలు, విటమిన్ డి కూడా ఉపయోగపడతాయి. చేప మాంసం క్రమం తప్పకుండా తింటే పెద్ద పేగు క్యాన్సర్, పురీష నాళానికి సంబంధించిన క్యాన్సర్ రాకుండా 12 శాతం వరకు నియంత్రించవచ్చనేది ఆ నివేదిక సారాంశం. అంతేకాదు ఓమేగా - 3 ఫాటీ ఆమ్లాలు చేప మాంసలో విరివిగా ఉంటుంది. అలా చేపలు ఎక్కువగా తింటే గుండెనొప్పి, మానసిక వత్తిడి, హైబీపీ లాంటివి తగ్గుతాయనేది ఒక అంచనా.