ఎమ్మెల్సీ కవితకు ఈడీ షాక్.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సోదాలు నిర్వహిస్తున్న ఈడి దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా 30 చోట్ల దాడులు కొనసాగిస్తున్న ఈడీ హైదరాబాద్ లో ఆరు చోట్ల తనిఖీలను చేపట్టింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చిన ఈడీ అధికారులు ఆమె సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేపట్టారు.

ఎమ్మెల్సీ కవిత కవిత సన్నిహితుల ఇళ్ళలో ఈడీ సోదాలు ..
తెలంగాణ రాష్ట్రానికి చెందిన లిక్కర్ వ్యాపారి రాజేంద్రన్ పిళ్ళై, రాబిన్ డిస్ట్రిబ్యూట్ కంపెనీ, అభిషేక రావు, ప్రేమ్ సాగర్, సృజన్ రెడ్డి ఇళ్లలో ఈరోజు తెల్లవారుజాము నుండి ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తాజా తనిఖీలతో తెలంగాణ రాజకీయవర్గాలలో ఉత్కంఠ నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు లక్నో, గుర్గావ్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 32 నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పై ఆరోపణలు, తెలంగాణాలో కొనసాగిన రగడ
ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందని, కెసిఆర్ కుమార్తె కవిత ఆధ్వర్యంలోనే ఢిల్లీలోని ఓబెరాయ్ హోటల్లో లిక్కర్ సెటిల్మెంట్లు జరిగాయని బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సా చేసిన ఆరోపణలతో ఒకసారిగా లిక్కర్ కుంభకోణంలో కవిత పేరు చర్చకు వచ్చింది. ఇక తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్సీ కవిత బిజెపి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే కెసిఆర్ భయపడతారని ఇలాంటి ఆలోచన చేస్తున్నారంటూ మండిపడ్డారు.

పరువు నష్టం దావా వేసిన కవిత.. బీజేపీ నేతలకు కోర్టు నోటీసులు
కెసిఆర్ ని మానసికంగా క్రుంగదీయాలని చూస్తున్నారని విమర్శించిన కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు తనపై ఆరోపణలు చేసి బిజెపి ఎంపీ, మాజీ ఎమ్మెల్యే పై పరువు నష్టం దావా వేశారు. ఇక ఈ వ్యవహారంలో కోర్టు కూడా బిజెపి ఎంపీ పర్వేశ్ వర్మ, మంజీందర్ సిర్సాలకు ఎమ్మెల్సీ కవిత పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ ఆదేశించింది. ఇక సభలు, మీడియా, సామాజిక మాధ్యమాలలో నిరాధార ఆరోపణలు చెయ్యొద్దని పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. ఇక ఈ కేసుపై విచారణ సెప్టెంబర్ 13వ తేదీ వరకు వాయిదా వేసింది న్యాయస్థానం.

ఈడీ దాడులతో రాజకీయ వర్గాలలో ఆసక్తి
ఇదిలా ఉంటే తాజా పరిణామాలతో, తాజాగా కొనసాగుతున్న ఈడీ దాడులతో మరోమారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు ఆమె సన్నిహితుల ఇళ్లల్లో ఈడీ అధికారులు చేస్తున్న దాడులు ఊతం ఇస్తున్నాయి. తెలంగాణా రాజకీయ వర్గాలలోనూ తాజాగా కొనసాగుతున్న ఈడీ దాడులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.












Click it and Unblock the Notifications