అనారోగ్యం అయినా అత్యవసరం అయితేనే .. గాంధీలో ఓపీ బంద్ .. ఉస్మానియాకి రోగుల తాకిడి
కరోనా వైరస్ ప్రబలుతున్న మాట అటుంచి సామాన్యులు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు బాగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రం అంతా లాక్ డౌన్ ఉన్న నేపధ్యంలో ఆస్పత్రులకు వెళ్ళటం , వైద్యం చేయించుకోవటం సామాన్యులకు ప్రహసనంగా మారుతుంది . అనారోగ్యం అయినా అత్యవసరం అయితేనే బయటకు రావాలని చెప్తున్నారు పోలీసులు .ఇక హైదరాబాద్ లో గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులకు చికిత్స జరుగుతున్న నేపధ్యంలో ఓపీ సేవలు బంద్ చేశారు. ఉస్మానియాకు రిఫర్ చెయ్యటంతో ఉస్మానియా ఆస్పత్రి రద్దీగా మారింది .
తెలంగాణా లాక్ డౌన్ ఎఫెక్ట్ .. కఠినంగా ఆంక్షలు
కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేసింది సర్కార్ . ఎవరూ ఇళ్ళ నుండి బయటకు రావద్దని ఒకవేళ వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి . ఇక లాక్ డౌన్ ప్రకటించినా నిన్న తెలుగు రాష్ట్రాల్లో , ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రంలో ప్రజలు లాక్ డౌన్ ను లైట్ తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే కరోనా కేసులు తెలంగాణా రాష్ట్రంలో పెరుగుతున్న నేపధ్యంలో కేంద్రం సీరియస్ అవ్వటం , ఇక రాష్ట్రం సైతం బయటకు వచ్చే ప్రజల పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకోవటంతో నేడు హైదరాబాద్ లో లాక్ డౌన్ విజయవంతంగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.
సాధారణ ఆరోగ్య సమస్యలు ఎదురైతే తప్పని తిప్పలు
ఇక ప్రజలు పోలీసులకు సహకరిస్తున్నారు. ప్రజలు అవసరమైతే తప్పించి దాదాపుగా ఎవరూ బయటకు రావడం లేదు. ఇక ఎవరైనా బయటకు వచ్చినా వచ్చిన వెంటనే పని ముగించుకొని వెళ్లిపోతున్నారు. రోడ్డుపై పోలీసు వాహనాలు తప్పించి మరేమి కనిపించడం లేదు. 24 గంటలపాటు ఇళ్లకే పరిమితం కావాలంటే కష్టమే. కానీ, తప్పనిసరి కాబట్టి ప్రజలు ఇళ్లలోనే ఉంటున్నారు. ఇక ఎవరికైనా సాధారణ అనారోగ్య సమస్యలు తలెత్తితే మాత్రం ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలంటే తల ప్రాణం తోకకొస్తుంది .
గాంధీలో ఓపీసేవలు బంద్ .. ఉస్మానియాకు తాకిడి
ఇక ఇదిలా ఉంటె, తెలంగాణలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో ఓపి సేవలను బంద్ చేశారు. ఓపి సేవల కోసం గాంధీకి వచ్చిన వారిని ఉస్మానియాకు రిఫర్ చేస్తున్నారు. దీంతో ఉస్మానియా హాస్పిటల్ కు తాకిడి పెరిగింది. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వ్యక్తులను మాత్రమే రోడ్డుపైకి అనుమతిస్తున్నారు. సామాన్యులు ఎవరిని కూడా బయటకు రానివ్వడం లేదు. ఇక అన్ని ఆస్పత్రుల్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు వైద్యం అందించే నాధుడే లేని పరిస్థితి ప్రజలను ఇబ్బందికి గురి చేస్తుంది.