హైదరాబాద్లో ఏం జరుగుతోంది? కరోనా భయంతో వణుకుతోన్న ప్రజలు.. ఆ 85 మందికీ సోకిందా?
దేశంలోనే ఐదో అతిపెద్ద నగరం, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో కొన్ని గంటలుగా ఒకరకమైన వాతావరణం నెలకొంది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్కు కరోనా పాజిటివ్ అని తేలడం, ఆ వార్తను కేంద్ర ప్రభుత్వం బ్రేక్ చేయడంతో గ్రేటర్ వాసులు ఒక్కసారే ఉలిక్కిపడ్డారు. ఒక్క కేసుతో మనకొచ్చిన ప్రమాదమేదీ లేదని, అనవసరంగా భయాందోళనలకు గురికావొద్దంటున్న ప్రభుత్వం.. మరోవైపు సిటీలోని కొన్ని కీలక ప్రాంతాల్లో అత్యవసర చర్యలు చేపట్టింది. సదరు సాఫ్ట్వేర్ ఇంజినీర్ ద్వారా మరో 85 మందికి వైరస్ వ్యాపించి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video
ఆ ఐదు రోజుల్లో ఏం జరిగింది?
దుబాయ్ లో కరోనా కాటుకు గురైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఈ నెల 22న సికింద్రాబాద్లోని మహేంద్రా హిల్స్కు వచ్చారు. విపరీతమైన దగ్గు, జ్వరంతో బాధపడుతూ 27వ తేదీన సికింద్రాబాద్ అపోలోలో చేరారు. ఆ తర్వాత ఆయనను గాంధీ ఆస్పత్రిలోని కరోనా ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కాగా, ఆయన ఇంట్లో ఉన్న ఐదు రోజులపాటు సుమారు 85 మందితో సన్నిహితంగా ఉన్నట్లు తేలింది. వైరస్ వ్యాప్తి భయాల నేపథ్యంలో ఆ 85 మందినీ గుర్తించామని, అందరికీ టెస్టులు చేశామని ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ల్యాబ్ నుంచి ఫలితాలు వచ్చాక తదుపరి చర్యలుంటాయన్నారు. మరోవైపు..
నిర్మానుష్యంగా ఆ ప్రాంతం..
సికింద్రాబాద్లోని మహేంద్రా హిల్స్ ప్రాంతంలో జీహెచ్ఎంసీ అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. వైరస్ వ్యాప్తి చెందకుండా పారిశుధ్యం, ఇతరత్రా పనులు చేపట్టారు. సోమవారం నుంచే ప్రజలు ఆందోళనగా కాలం గడుపుతుండగా.. మంగళవారం నాటికి ఆ ప్రాంతం దాదాపు నిర్మానుష్యంగా మారింది. నిజానికి కరోనా వ్యాప్తిపై కచ్చితమైన సమాచారం లేనప్పటికీ, దాదాపు సిటీ అంతటా ఒకరకమైన ఆందోళనకర వాతావరణం విస్తరించింది. జనం తమ వాళ్లకు ఫోన్లు చేస్తూ కరోనా గురించి ఆరాలు తీయడం, ప్రతి సమూహమూ దీని గురించే మాట్లాడుకోవడం కినిపించింది. దీనికితోడు..
కరోనా వార్డును తరలించాలంటూ..
చైనా నుంచి కరోనా వ్యాప్తి చెందిన మొదటి దశలోనే భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేయడం.. ఆయా సిటీల్లో కరోనా వ్యాప్తి నిరోధానికి ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయడం, తెలంగాణ ప్రభుత్వం.. సికింద్రాబాద్ లోని ప్రఖ్యాత గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా కరోనా వార్డును నెలకొల్పడం తెలిసిందే. చానాళ్లు ఎలాంటి హడావుడి లేనప్పటికీ.. సోమవారం నాటి ప్రకటన తర్వాత గాంధీ ఆస్పత్రిలో వాతావరణం మారిపోయింది. కరోనా పాజిటివ్ గా తేలిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులోనే చికిత్స పొందుతున్నాడు. భయాల నేపథ్యంలో ఆ వార్డును అక్కడి నుంచి వేరే చోటికి తరలించాలంటూ మిగతా పేషెంట్లు డిమాండ్ చేస్తున్నారు. పేషెంట్ల బంధువులు కూడా దీనిపై ఆందోళనకు సిద్ధమైనట్లు తెలిసింది. మాస్కుల కొరత కూడా ఆస్పత్రిని వేధిస్తున్నది.
భయపడొద్దు..
కరోనా వైరస్ పై హైదరాబాద్ అంతటా నెలకొన్న భయాల నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం మరోసారి ప్రకటనలు చేశారు. అనవసరంగా కంగారు పడొద్దని, చిన్నచిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా భద్రంగా ఉండొచ్చని తెలిపారు. మరోవైపు ఆయుశ్ శాఖ ఆధ్వర్యంలో శ్వాస సంబంధిత ఇబ్బందుల్ని తొలగించే ప్రాఫిలాక్టిక్ హోమియో మందుల్ని సిటీలో పలు చోట్ల ఉచితంగా పంచుతున్నారు. చిన్నపిల్లలు ఉన్న కుటుంబాల్లో ఎక్కువ ఆందోళన కనిపిస్తున్నది. నిజానికి కరోనా ప్రభావం చిన్నపిల్లలపై చాలా తక్కువగా ఉంటుదని డాక్టర్లు చెబుతున్నారు.
3,100కు పెరిగిన మరణాలు..
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ఇండియాతో పాటు మరో పాతిక దేశాల్లో ప్రభావం చూపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటిదాకా 3,100 మంది చనిపోగా, సుమారు లక్ష మంది వైరస్ బారినపడ్డారు. చైనా తర్వాత ఎక్కువగా ఎఫెక్టయిన సౌత్ కోరియాలో ఒక్క మంగళవారమే 125 కొత్త కేసులు నమోదయ్యాయి. అగ్రరాజ్యం అమెరికాలోనూ మంగళవారం నాటికి ఆరుగురు చనిపోయారు. మన దేశంలో కేరళలో గతంలో ముగుగురికి కరోనా నయమైంది. ప్రస్తుతం తెలంగాణ, ఢిల్లీల్లో ఒక్కో కేసు నమోదైంది. తాజాగా యూపీలో మరో ఏడుగురికి వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి.