జీడిమెట్లలో ఫైర్ యాక్సిడెంట్.. పేలిన 5 రియాక్టర్లు, ముగ్గురికి గాయాలు
హైదరాబాద్లో గల జీడిమెట్లలో అగ్నిప్రమాదం జరిగింది. పారిశ్రామిక వాడలో గల శ్రీధర బయోటెక్ సంస్థలో రియాక్టర్లు పేలాయి. ఐదు రియాక్టర్లు పేలడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో అక్కడే గల స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం. వారిని సమీపంలో గల ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారట. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రెండు ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆపివేస్తున్నారు.
ప్రమాదంతో జీడిమెట్ల ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమీపంలో ఇతర ఫార్మా, బయోటెక్ సంస్థలు ఉంటాయి. అక్కడికి మంటలు వ్యాపిస్తాయా అనే ఆందోళన నెలకొంది. శ్రీధర బయోటెక్ సంస్థలో జరిగిన ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.