పదో తరగతి మెమోల నుండి పోస్టల్ ఉద్యోగాల దాకా ... హైదరాబాద్ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్ల దందా
దేశంలో నకిలీలు పెరిగిపోయారు. ఎక్కడ చూసినా నకిలీ , ఎం చేసినా నకిలీ .. నకిలీ వెబ్ పోర్టల్స్, నకిలీ సర్టిఫికెట్స్ , నకిలీ కరెన్సీ ఇలా ఎందులో చూసినా నకిలీ దందా చేస్తున్న వాళ్లు కుప్పలుతెప్పలుగా పెరిగారు. పదో తరగతి సర్టిఫికెట్ల నుండి పోస్టల్ శాఖలో ఉద్యోగాల వరకూ నకిలీ సర్టిఫికెట్ లను సృష్టిస్తూ ప్రభుత్వాలను బురిడీ కొట్టిస్తున్నారు అంటే దేశంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రధాని పేరుతోనే నకిలీ పథకం ..ఆ నకిలీ వెబ్సైట్స్ కు దేశవ్యాప్త ఏజెంట్స్..ప్రజలను దోచేసిన కేటుగాళ్ళు
నకిలీ సర్టిఫికెట్లను తయారుచేస్తున్న ముఠా గుట్టు రట్టు
నిన్నటికి నిన్న ప్రధానమంత్రి శిశు వికాస్ యోజన పేరుతో నకిలీ వెబ్ సైట్ పెట్టి ప్రజల నుండి డబ్బులు దండుకున్న వారు కొందరైతే, ఇక తాజాగా నకిలీ ఎస్ఎస్సి సర్టిఫికెట్లను, ఏకంగా పోస్టల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన తాత్కాలిక ఉద్యోగాల సర్టిఫికెట్లను నకిలీవి తయారుచేసి దందా సాగిస్తున్న ముఠాను హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది.
నకిలీ సర్టిఫికెట్ల తయారీ కి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుల వద్ద నుండి 13 నకిలీ ఎస్ఎస్సి సర్టిఫికెట్లను, లాప్ ట్యాప్ లను , ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఎస్ఎస్సి సర్టిఫికెట్ల నుండి పోస్టల్ డిపార్ట్ మెంట్ ఉద్యోగాల దాకా .. అంతా నకిలీనే
నకిలీ దందా సాగిస్తున్న వీరిని సంతోష్ రెడ్డి, మహేందర్, రాజేష్ కుమార్, జయంత్ కుమార్ లుగా గుర్తించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ పదో తరగతి మార్కుల మెమో లకు సంబంధించి వీరు నకిలీ సర్టిఫికెట్ లను తయారు చేస్తున్నారు. అంతేకాదు ఏకంగా ఉద్యోగాలకు సంబంధించి కూడా నకిలీ సర్టిఫికెట్స్ తయారుచేస్తున్నారు. ఈ ముఠా కి ప్రధాన సూత్రధారి అయిన మహేందర్ నుండి గతంలో జయంత్ అనే నిందితుడు నకిలీ సర్టిఫికెట్ల ద్వారానే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం పొందాడు.
ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు .. బాధితుల ఫిర్యాదు
దీంతో ఈ ముఠా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కో వ్యక్తి నుండి రెండు లక్షల రూపాయల నుండి 3 లక్షల రూపాయల వరకు వసూలు చేశారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ముఠా ఇచ్చిన నకిలీ సర్టిఫికెట్ల ద్వారానే ముగ్గురు వ్యక్తులు తాత్కాలిక ఉద్యోగాలకు ఎంపికైనట్లుగా తెలుస్తోంది. మరి కొంతమంది ఈ ముఠాకు డబ్బులు చెల్లించి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వారికి ఉద్యోగాలు ఇప్పించక పోవడంతో ముఠా చేతిలో మోసపోయామని భావించిన వారంతా పోలీసులను ఆశ్రయించారు.
నిందితులను విచారిస్తున్న పోలీసులు
కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి ఈ నకిలీ స్కామ్ గుట్టు బయట పెట్టారు . ఏకంగా కేంద్ర ప్రభుత్వ శాఖ అయిన పోస్టల్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలకే నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు షాక్ తిన్నారు. నిందితులను అరెస్టు చేసి ఇప్పటి వరకు వీరు ఎంత మందికి నకిలీ సర్టిఫికెట్ లను ఇచ్చారు అన్న అంశంపై దర్యాప్తు సాగిస్తున్నారు.