గ్రేటర్ హైదరాబాద్లో ఆస్తుల ఆన్లైన్ సర్వేను తాత్కాలికంగా నిలిపివేసిన సర్కార్ ..వరదల ఎఫెక్ట్
ఇటీవల కురిసిన భారీ వర్షాలు గ్రేటర్ హైదరాబాద్ వాసులకు నరకాన్ని చూపిస్తున్నాయి. వేల సంఖ్యలో కాలనీలు నీటమునిగాయి. నేటికీ పలు కాలనీలు జలదిగ్బంధంలోనే చిక్కుకుని ఉన్నాయి. అయితే ప్రస్తుతం వర్షాలు వరదలు కాస్త తగ్గినా చాలా ప్రాంతాల్లో వరద కారణంగా పేరుకుపోయిన బురద,అపరిశుభ్ర పరిస్థితులు స్థానికులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ధరణి పోర్టల్ లో ప్రతి ఒక్కరూ తమ ఆస్తులను ఆన్లైన్ చేసుకోవాలని ఆదేశించిన ప్రభుత్వం, అందుకు సర్వే నిర్వహిస్తోంది. తాజా వరదల నేపథ్యంలో ప్రస్తుతానికి తాత్కాలికంగా సర్వేను నిలిపివేస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
వరద సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ అధికారులు
హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాల కారణంగా జిహెచ్ఎంసి పరిధిలో వరద బీభత్సం కొనసాగింది. దీంతో వేల సంఖ్యలో కాలనీలు నీట మునిగాయి. ట్రాన్స్ఫార్మర్లు ,రహదారులు కొట్టుకుపోయాయి . హైదరాబాద్ నగర జీవనం అంతా అస్తవ్యస్తంగా మారింది. ఇక జీహెచ్ఎంసీకి నగరవాసుల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అధికారులు వరద సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జిహెచ్ఎంసి అధికారులు అందిస్తున్న సహాయక చర్యలు కూడా ప్రజలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. దీంతో ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది.
హైదరాబాద్లో ఆస్తుల ఆన్లైన్ సర్వే నిలిపి వేయాలని సర్కార్ నిర్ణయం
ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఆస్తుల ఆన్లైన్ సర్వే నిలిపి వేయాలని నిర్ణయం తీసుకున్నారు. వరదలు పూర్తిగా తగ్గిన తర్వాత, సాధారణ పరిస్థితి నగరంలో వచ్చిన తర్వాత తిరిగి ఆస్తుల ఆన్లైన్ సర్వేలో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
అంతేకాదు అసలే వరద ముంపు కారణంగా చిరాకుగా ఉన్న ప్రజల నుండి ఈ సర్వే విషయంలో ఎలాంటి నెగిటివ్ స్పందన వస్తుందో అన్న భావన కూడా లేకపోలేదు . ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఆన్ లైన్ లో ఆస్తుల నమోదుపై , తాజాగా ప్రభుత్వం తెచ్చిన చట్టాలపై నిప్పులు చెరుగుతున్నాయి . ప్రజలను నేరుగా ప్రభుత్వానికి సహకరించకండి అని సూచిస్తున్నారు ప్రతిపక్ష నేతలు .
దసరా నాటికి ధరణి పోర్టల్ .... సర్వేలలో అధికారుల బిజీ .. కానీ
దసరా పండుగ సమయానికి ధరణి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం కేసీఆర్ భావించారు. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన సర్వే ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆస్తులను ఆన్లైన్ చేసుకోవాలని ప్రజలకు సూచించడంతో పాటుగా, అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. ఇళ్ళు, ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్లు తదితర అన్ని వివరాలను సర్వేలో భాగంగా అందరూ ఇవ్వాలని, అలా నమోదు చేసుకుంటేనే భవిష్యత్లో ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రజలకు చెప్పారు.
Recommended Video
వరదల దెబ్బకు సర్వే నిలిపివేత ... దసరాకు ధరణి పోర్టల్ ప్రారంభం డౌటే !!
అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి ఆస్తికి సంబంధించిన అన్ని వివరాలతో పాటుగా, ఆధార్ కార్డు నంబర్లు, నల్లా బిల్లు, కరెంట్ బిల్లు తదితర అన్ని వివరాలను సేకరించి ఆన్లైన్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఊహించని విధంగా హైదరాబాద్ లో భారీ వర్షాలు ముంచెత్తడంతో తాత్కాలికంగా ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. తాజా పరిణామాలతో దసరాకి ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు.