గ్రేటర్ వార్: నేటితో నామినేషన్ల పర్వానికి తెర..ప్రచారంపై ఈసీ కీలక ఆదేశాలు
హైదరాబాద్ లో ఎన్నికల వేడి రాజుకుంది. జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రచారాన్ని మొదలు పెట్టిన గ్రేటర్ హైదరాబాద్ లోని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున నిబంధనల మేరకే అభ్యర్థులు ప్రవర్తించాలని స్పష్టం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో అభ్యర్థులు పార్టీలు ఎన్నికల నియమావళిని పాటించాలని పేర్కొన్న ఎన్నికల సంఘం, పర్మిషన్ లేకుండా లౌడ్ స్పీకర్ ఉపయోగించకూడదని, రికార్డింగ్ చేసిన ఉపన్యాసాలను వాడాలని పేర్కొంది.
అనుమతులతోనే ప్రచారం నిర్వహించాలని ఆదేశించిన ఈసీ
బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించాలి అనుకున్నవారు అనుమతి తీసుకొని ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు. ఇక మైక్ లను ఉపయోగించి ప్రచారం చేయదలచుకున్నవారు ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మైక్ లను ఉపయోగించాలని ఎన్నికల సంఘం షరతులు పెట్టింది. ప్రచారం సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న రోగులు సౌండ్ పొల్యూషన్ తో ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది ఎన్నికల సంఘం. అనుమతిలేకుండా ప్రచారానికి వెళ్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేసింది.
ఒకే రోడ్ లో రెండు పార్టీల కన్నా ఎక్కువ ర్యాలీలు నిర్వహించకూడదు
ఒక రోడ్డులో రెండు కన్నా ఎక్కువ పార్టీలు ర్యాలీలు తీయకూడదని పేర్కొంది. ఒక పోలింగ్ కు , ఓట్ల లెక్కింపు కు 48 గంటల ముందు నుంచే లిక్కర్ అమ్మకాలను నిలిపి వేస్తామని స్పష్టం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ స్లిప్ లపై ఓటర్ పేరు ఇతర వివరాలు మాత్రమే ఉండాలని, గోడల మీద ఎలాంటి రాతలు ఉండకూడదని, పోస్టర్లు అంటించడం నిషేధించామని పేర్కొంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న పోస్టర్లు, బ్యానర్లను తొలగించిన ఈసీ ఎన్నికల నిబంధనలు పాటించకుంటే కొరడా ఝుళిపిస్తామని స్పష్టం చేసింది.
Recommended Video
నేటితో నామినేషన్ల అంకానికి తెర ... సాయంత్రం 3 గంటల వరకే నామినేషన్లు
ఇక నేటితో జిహెచ్ఎంసి ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. ఎన్నికల కమిషన్ నామినేషన్లకు మూడు రోజులు గడువు ఇచ్చిన క్రమంలో 18వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఈరోజు సాయంత్రం మూడు గంటల కల్లా ముగియనుంది. ఇప్పటివరకు 537 మంది అభ్యర్థులు 597 నామినేషన్లను దాఖలు చేయగా పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటిస్తూనే ఉన్నాయి. ఈ రోజు మొత్తం నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో సాయంత్రానికి ఏ పార్టీ నుండి ఎంతమంది నామినేషన్లు వేశారు అనేది తెలియనుంది.