భాగ్యనగరంలో దంచికొట్టిన వాన, జలమయమైన లోతట్టు ప్రాంతాలు, ఇబ్బందిపడ్డ జనం
అప్పుడే ఎండ, ఉక్కపోతతో జనం కాస్త అసహనం ఉంటే చాలు.. మబ్బు కమ్ముకొంటుంది. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. వర్షపునీరు లోతట్టుప్రాంతాలు, రహదారులపై నిలిచిపోయింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంతో తమకు ఇక్కట్లు తప్పడం లేదని వాపోతున్నారు.
భారీ వర్షంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు సుందరయ్య పార్కు రోడ్డులో మోకాల్లోతులో వర్షపు నీరు నిలిచిపోయింది. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో కూడా వర్షపునీరు భారీగా చేరింది. దీంతో అక్కడి జనాలు పండగపూట కూడా తమకు వరద తప్పడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం శాశ్వత చర్యలు తీసుకోవడం లేకపోవడం వల్ల తమకు అవస్థలు తప్పడం లేదని అంటున్నారు.
కాచిగూడ, అంబర్పేట, చిక్కడపల్లి, ముషీరాబాద్, నాగోల్, బండ్లగూడ, కోఠి, గోషామహల్, నాంపల్లి, బషీర్బాగ్, దిల్సుఖ్నగర్, మలక్పేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, చింతల్కుంట, సైదాబాద్, చంపాపేట్, సరూర్నగర్, బేగంపేట్, కూకట్పల్లి, జీడిమెట్ల, దుండిగల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, కుషాయిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో భారీ వర్షం కురిసింది. వర్షపునీరు ప్రధాన రహదారుల్లో నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.