హమ్మయ్యా.. ఆ 4 అధికారులకు రిలీఫ్.. జైలు శిక్షపై హైకోర్టు సీజే స్టే
నలుగురు పోలీసులకు ఇటీవల హైకోర్టు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. కోర్టు ధిక్కరణ కింద శిక్ష విధించింది. దీనిని సదరు అధికారులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో విచారించారు. సింగిల్ బెంచ్ జస్టిస్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. దీంతో ఆ నలుగురు అధికారులకు ఊరట కలిగింది.
కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు హైదరాబాద్ పోలీసు అధికారులకు ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం తీర్పుపై స్టే విధించింది. పోలీసు అధికారులు దాఖలు చేసుకున్న అప్పీల్ పిటిషన్పై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. భార్యాభర్తల వివాదానికి సంబంధించి జూబ్లీ హిల్స్ పోలీసులు నిబంధనలు పాటించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి విచారణ చేపట్టారు.
ఇరు వర్గాల తరఫున వాదనలు విన్న న్యాయమూర్తి... జూబ్లీ హిల్స్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ హోదాలో ఎస్సై నరేశ్, సీఐ రాజశేఖరరెడ్డి, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, నాడు వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేసిన ఏఆర్ శ్రీనివాస్లకు నాలుగు వారాల జైలు శిక్షను విధించారు. ఈ శిక్షను నిలుపుదల చేస్తూ హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం స్టే విధించింది.
అంతకుముందు నలుగురికి డిపార్ట్మెంటల్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని సీపీకి ఆదేశాలు ఇచ్చింది. భార్యాభర్తల వివాదం కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు సీఆర్పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని అభియోగం నమోదైంది. అప్పీలుకు వెళ్లేందుకు శిక్ష అమలును ఆరువారాల పాటు నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ లోపు అప్పీల్ చేసుకోగా.. ఊరట కలిగింది.