ప్రమాదంలో హైదరాబాద్ మెట్రో .. మూసాపేట పిల్లర్ పై అధికారుల స్పందన ఇదే
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. హుస్సేన్ సాగర్ ప్రమాదకర రీతిలో నీటితో నిండుతోంది. నగర రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల దెబ్బకు హైదరాబాద్ మెట్రోకు ప్రమాదం పొంచి ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటిదేమీ లేదని చెప్తున్నారు మెట్రో అధికారులు.
భారీ వర్షాల ఎఫెక్ట్ ... హైదరాబాద్ లో ట్రాఫిక్ మళ్ళింపులు .. ఎక్కడెక్కడ అంటే
మూసాపేట పిల్లర్ చుట్టూ పెద్ద గొయ్యి
హైదరాబాద్ మెట్రో పిల్లర్ లపై కూడా వరద ప్రభావం పడింది . మూసాపేట మెట్రో పిల్లర్ దగ్గర చుట్టూ పెద్ద గొయ్యి ఏర్పడింది . అక్కడ భూమి చాలా లోతుగా కుంగిపోయింది. దీంతో రోడ్డు కూడా కుంగి ఆ గుంతలో నీరు చేరిందని తెలుస్తుంది. మెట్రో పిల్లర్ల చుట్టూ నిర్మించిన సెక్యూరిటీ సర్ఫేస్ వాల్ కొట్టుకుపోయి రెండు పిల్లర్ల చుట్టూ ఉన్న రోడ్డు ,డివైడర్లు కోతకు గురయ్యాయి. సర్ఫేస్ వాల్ పై మెట్రో పిల్లర్ నిర్మించడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తుంది.
నీటిని తోడి పోస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు
మెట్రో పిల్లర్ చుట్టూ పెద్ద గొయ్యి ఏర్పడడంతో జిహెచ్ఎంసి అధికారులు మోటార్ల ద్వారా నీటిని తోడి పోస్తున్నారు. ఆ మార్గంలో వెళ్లే వాహనచోదకులు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. బారికేడ్లను ఏర్పాటు చేసి పిల్లర్ చుట్టూ ఉన్న నీటిని తోడుతున్నారు .అయితే అక్కడ పిల్లర్ల పరిస్థితి చూసినవారంతా హైదరాబాద్ మెట్రోకు ప్రమాదం పొంచి ఉందని మాట్లాడుకుంటున్నారు. పిల్లర్ల చుట్టూ భారీ గుంత పడడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
పిల్లర్ చుట్టూ గొయ్యితో ఎలాంటి ప్రమాదం లేదన్న అధికారులు
అయితే మెట్రో అధికారులు పిల్లర్ చుట్టూ ఏర్పడిన గుంత కారణంగా మెట్రోకు ఎటువంటి ఇబ్బంది లేదని, గతంలో తవ్వి రోడ్డు వేసిన చోటే భూమి కుంగిపోయి గొయ్యి ఏర్పడిందని, రోడ్డు కుంగిపోవడానికి, మెట్రోకు సంబంధం లేదని వారు అంటున్నారు. దాని వల్ల మెట్రో కి వచ్చే ఇబ్బంది ఏమీ లేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. మెట్రో ట్రాక్ కోసం వేసిన పిల్లర్ చాలా లోతుగా వేసిందని దానికి, రోడ్డు కుంగి పోవడానికి ఎలాంటి సంబంధం లేదని మెట్రో అధికారులు చెబుతున్నారు.