హైదరాబాద్ వర్షాలు-వరదలు: సెల్లార్లో నీటిని తోడే ప్రయత్నంలో వైద్యుడు మృతి
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వర్షం నగరాన్ని అతలాకుతలం చేస్తోంది. నగరంలోని రోడ్లతోపాటు జనావాసాలు కూడా వరద నీటితో నిండిపోయాయి. ఇప్పటికే వరదల కారణంగా 10 మంది మరణించగా.. తాజాగా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.
శ్రీనగర్ కాలనీ ప్రాంతంలోని ఎస్బీహెచ్ కాలనీలో సతీష్ రెడ్డి అనే వైద్యుడు నివాసముంటున్నారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆయన నివసించే అపార్ట్మెంట్ సెల్లార్ వరదనీటితో నిండిపోయింది. దీంతో ఆ నీటిని తోడే క్రమంలో మోటారు వేసేందుకు యత్నించాడు.

ఈ క్రమంలో వైద్యుడు విద్యుత్ షాక్కు గురై కుప్పకూలిపోయారు. గమనించిన అపార్ట్మెంట్ వాసులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యలోనే అతడు మృతి చెందాడు. ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ఇలావుంటే, భారీ వర్షాల కారణంగా ఓ పాత భవనం కూలి 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మరో ఘటనలో ఓ మూడేళ్ల బాలుడు సెల్లార్ నీటిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి వరద నీటిలో కొటుకుపోయాడు. భారీ వర్షాల కారణంగా నగర జీవులు బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
మరో రెండ్రోజులు భారీ వర్షాలు
హైదరాబాద్ నగర రహదారులు, కాలనీల్లో వదర నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కనీసం మూడు రోజుల వరకు నగరంలోని ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
అత్యసవర సేవల కోసం ఫోన్ నెంబర్లు..
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అత్యవసర ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. అత్యవసర సేవల కోసం 040-21111111, జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ 90001 13667, 97046 01866, జీహెచ్ఎంసీ పరిధిలో చెట్లు తొలగించే సిబ్బంది కోసం 63090 62583, జీహెచ్ఎంసీ విద్యుత్ శాఖ 94408 13750, ఎన్డీఆర్ఎఫ్ సేవల కోసం 83330 68536, 040 2955 5500 నెంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications