బిరియాని పై ఓవైసీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ : అమిత్ షాకు ఈ బిరియాని పంపమని కేసీఆర్కు చెబుతా..!
హైదరాబాదు: తెలంగాణ ఎన్నికలకు ఇంకా ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉండటంతో రాష్ట్రమంతా ప్రచార పర్వాలతో హోరెత్తిపోతోంది. ఇటు ప్రాంతీయ పార్టీల అగ్రనాయకులతో పాటు అటు జాతీయ పార్టీల అగ్రనాయకులు కూడా ప్రచారంలోకి దిగడంతో వారిమధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు టీడీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిసి ప్రజాకూటమి తరుపున ప్రచారాన్ని రక్తి కట్టించగా... ఇక కేసీఆర్ సింగిల్గా ప్రచారం చేస్తూ తనదైన శైలిలో విమర్శలు సంధిస్తున్నారు. తాజాగా పిక్చర్లోకి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎంటర్ అయ్యారు. బీజేపీ అంటేనే ఎగిరిపడే అసదుద్దీన్ ఈ సారి కాషాయం పార్టీ అధినేత అమిత్షా లక్ష్యంగా వ్యాఖ్యలు చేశారు.
అక్బరుద్దీన్ ఓవైసీ... మజ్లిస్ అధినేత. తన చురుకైన మాటలతో... వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక పార్లమెంటులో మైకు పట్టాడంటే చాలు... అందరి దృష్టిని ఆకర్షిస్తారు. కాషాయం పార్టీ అంటే గిట్టని ఈ మజ్లిస్ నేత తాజాగా అమిత్షాను టార్గెట్ చేశారు. ఇప్పటికే అమిత్ షా తనపై పోటీ చేయాలని పలుమార్లు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు సీజన్ నడుస్తుండటంతో మాటల పదను నాయకులు పెంచారు. ఈ క్రమంలోనే తెలంగాణలో పర్యటించిన బీజేపీ జాతయాధ్యక్షుడు అమిత్ షా కేసీఆర్పై పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారికి కేసీఆర్ బిరియాని పంపించి వారిని మచ్చిక చేసుకుంటున్నారనే వ్యాఖ్యలు చేశారు. షా చేసిన వ్యాఖ్యలపై మజ్లిస్ అధినేత ఓవైసీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. దీంతో నేతల మధ్య బిరియాని వార్ ముదురుతోంది.
అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు అసదుద్దీన్ ఓవైసీ. ఎవరైనా బిరియాని తినడం చూస్తే అమిత్ షా ఓర్చుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు అసదుద్దీన్. ఒకరి కడుపు నిండుతుంటే అమిత్ షాకు కడుపు నొప్పి వేస్తోందని ఛలోక్తులు విసిరారు ఓవైసీ. అంతేకాదు అమిత్ షాకు బిరియాని ఇష్టమన్న సంగతి తనకు తెలియదంటూ చెబుతూనే ఈ సారి అమిత్ షాకు బీఫ్ బిరియాని పంపమని కేసీఆర్కు ఫోన్ చేసి చెబుతాను అని ఓవైసీ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీపై కూడా పంచ్లు పేల్చారు ఓవైసీ. నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు వివాహానికి ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లారని గుర్తు చేశారు ఓవైసీ. అక్కడ చేతులు కలిపాడని, కబుర్లు చెప్పుకున్నారని చెప్పిన ఓవైసీ వారు ప్రధానికి ఎలాంటి భోజనం పెట్టారో మీకు తెలుసా అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఈసారి ఒక అవగాహనతో వెళ్లి ఎన్నికల్లో పోటీచేస్తున్నాయి.