జగన్పై ఎందుకు దాడి చేశానో చెబుతా: నిందితుడు, జైల్లో రాసిన పుస్తకంలో కీలక అంశాలు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నంలో కత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాస రావును పోలీసులు ఎన్ఐఏ (జాతీయ దర్యాఫ్తు సంస్థ) న్యాయస్థానంలో ప్రవేశపెట్టింది. ఈ రోజు (శుక్రవారం)తో కస్టడీ ముగియడంతో కోర్టులో ప్రవేశపెట్టారు.
నిందితుడు శ్రీనివాస రావును రాజమండ్రి జైలుకు తరలించాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. విజయవాడ జైల్లో శ్రీనివాస రావుకు భద్రత లేదని, ప్రాణహానీ ఉందని అతని తరఫు లాయర్ చెప్పడంతో, కోర్టు అంగీకరించింది. ప్రత్యేక భద్రత మధ్య రాజమండ్రి జైలుకు తరలించాలని చెప్పింది. 25వ తేదీ వరకు రిమాండ్ విధించింది.

నాకు అవకాశమిస్తే, జగన్పై ఎందుకు దాడి చేశానో చెప్తా
తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఈ సందర్భంగా శ్రీనివాస రావు అన్నారు. ప్రజలతో మాట్లాడే అవకాశం తనకు ఇస్తే అన్ని విషయాలు చెబుతానని అన్నారు. అలాగే, ఈ పని ఎందుకు (జగన్ పైన దాడి) చేశానో కూడా చెబుతానని అన్నారు. నేను చేసిన పనిని అనవసరంగా రాజకీయ వివాదం చేస్తున్నారన్నారు.

నా పుస్తకం ఇప్పించండి, అందులో దాడి గురించి కీలక అంశాలు
అలాగే, జైల్లో తాను రాసిన పుస్తకాన్ని తనకు ఇప్పించాలని నిందితుడు కోర్టును కోరారు. జగన్ పైన ఎందుకు దాడి చేయవలసి వచ్చిందో తాను పుస్తకం రాశానని న్యాయస్థానానికి తెలిపారు. తాను రాసిన పుస్తకాన్ని లాక్కున్నారని చెప్పారు. ఈ పుస్తకంలో జగన్ పైన ఎందుకు దాడి చేశానో వివరంగా రాసుకున్నానని కోర్టుకు తెలిపారు. ఈ ఘటనపై నేను ప్రజలకు వాస్తవం చెప్పే అవకాశమివ్వాలన్నారు. కాగా, అందులో జగన్ పైన దాడికి సంబంధించిన కీలక అంశాలు రాసుకున్నారని తెలుస్తోంది.

30 గంటల పాటు లాయర్ లేకుండా విచారణ
మరోవైపు, కోర్టు ఆదేశాలను ఎన్ఐఏ ఉల్లంఘించిందని నిందితుడు శ్రీనివాస రావు తరఫు లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాస రావును ఎన్ని గంటలు విచారించారో చెప్పాలని న్యాయవాది కోరారు. ముప్పై గంటల పాటు న్యాయవాది లేకుండనే అతనిని విచారించారని ఆరోపించారు. విజయవాడ జైలులో తనకు ప్రాణహానీ ఉందని శ్రీనివాస రావు చెప్పారని, భద్రత పెంచాలని న్యాయవాది కోరారు. జైల్లో తోటి ఖైదీలను అతని వద్దకు వెళ్లకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఏ పరిస్థితుల్లో దాడి చేశారో పుస్తకంలో ఉంది
తాను జగన్ పైన ఏ పరిస్థితుల్లో దాడి చేశానని, ఎందుకు దాడి చేయవలసి వచ్చిందనే అంశాన్ని 22 పేజీలతో ఓ పుస్తకం రాశానని శ్రీనివాస రావు చెప్పారని లాయర్ అన్నారు. దానిని సబ్ జైలర్ లాక్కున్నట్లుగా కోర్టుకు చెప్పారని అన్నారు. ఆ పుస్తకం తనకు ఇస్తే దానిని మరింతగా పూర్తి చేయాల్సి ఉందని, మరిన్ని విషయాలు రాసుకోవాల్సి ఉందని చెప్పారు. ఆ పుస్తకంలో మరిన్ని పరిణామాలు కూడా రాసుకుంటానని జడ్జికి చెప్పారన్నారు. శ్రీనివాస రావు భద్రతపై మరో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications