ఒకే దెబ్బకు రెండు పిట్టలు -పవన్ కల్యాణ్ వ్యూహరచన -17,18 తేదీల్లో జనసేన క్రియాశీలక సమావేశాలు
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపు 8 నెలలపాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈ గ్యాప్ లో ట్విటర్ ప్రకటనకు మాత్రమే పరిమితమైన జనసేనాని.. ఇకపై నేరుగా ప్రజల్లో నిలబడి ప్రభుత్వాలపై పోరాటాలు చేయనున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే రీతిలో ఇటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేస్తూ, అటు అమరావతి రైతుల ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించేలా పవన్ వ్యూహరచన చేస్తున్నారు.

17, 18 తేదీల్లో కీలక సమావేశాలు..
ఈ నెల 17,18 తేదీల్లో పార్టీ క్రియాశీలక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జనసేన తెలియజేసింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 17వ తేదీ ఉదయం 11 గంటలకు ఇచ్ఛాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాలతో జనసేనాని పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం ఉంటుంది. ఇక..

అమరావతి రైతులతో జనసేనాని..
క్రియాశీలక సమావేశాల్లో భాగంగా జనసేనాని పవన్ ఈనెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు అమరావతి పోరాట సమితి నేతలు, అమరావతికి చెందిన కొందరు మహిళా రైతులతో భేటీ కానున్నారు. అదే సమయంలో 32 నియోజకవర్గాల్లో జనసేన క్రియాశీల సభ్యత్వం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలతో 18వ తేదీ ఉదయం 11 గంటలకు పవన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లో ఏపీ సీఎం జగన్ విధానాలను పవన్ ఎండగడ్డబోతున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి మిత్రుడిగా ఉన్నప్పటికీ, పార్టీ పరంగా తనదైన పంథాలో కొనసాగాలని పవన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరోవైపు..

గ్రేటర్ ఎన్నికల బరిలో జనసేన..
ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా పోరాడుతోన్న అమరావతి రైతులతో సమావేశం ద్వారా ఉద్యమానికి మద్దతు తెపడంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా జనసేనను పటిష్టం చేసేలా క్రియాశీలక సమావేశాల్లో పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేయనున్నాయి. మరోవైపు సంచలన రీతిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోనూ బరిలోకి దిగనున్నట్లు జనసేన అధికారికంగా ప్రకటించింది.
కేసీఆర్ సర్కారు తీరుతో గ్రేటర్ లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, జనం సమస్యలపై పోరాడి గతంలో లాఠీ దెబ్బలు కూడా తిన్నామని, ప్రజల గొంతుక వినిపించేందుకే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని జనసేన తెలంగాణ శాఖ వెల్లడించింది. డిసెంబర్ మొదటి వారంలోనే గ్రేటర్ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రచారంలో పవన్ పాల్గొంటారా? లేదా? అనేది తెలియాల్సిఉంది. కాగా, దుబ్బాక ఉప ఎన్నికలో విజయం ఊపుతో గ్రేటర్ పైనా పాగా వేయాలని బీజేపీ అడుగులు వేస్తోంది. మరి ఏపీలో మిత్రులైన బీజేపీ-జనసేన.. గ్రేటర్ లోనూ కలిపి పోటీ చేస్తాయా? అనేది ఖరారు కావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications