ఐరన్ లెగ్ రమణకు కేసీఆర్ ఆహ్వానం .. ఆయన టీడీపీకి పట్టిన శని : తెలంగాణా తెలుగు తమ్ముళ్ళ ధ్వజం
తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్.రమణ రాజీనామా చేయడంపై తెలంగాణ తెలుగు తమ్ముళ్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జూబ్లీహిల్స్ టీడీపీ ఇన్చార్జి జి వి జి నాయుడు నిర్వహించిన మీడియా సమావేశంలో రమణ వెళ్లిపోయినందుకు టిడిపి శ్రేణులు ఉత్సవాలు చేసుకుంటున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్.రమణ కు టపాకాయలు కాలుస్తూ వీడ్కోలు పలికిన నేతలు ఆయన వెళ్ళిపోవటంపై పెద్దగా బాధను వ్యక్తం చెయ్యలేదు.
తెలుగుదేశం పార్టీకి గత ఏడేళ్లుగా పట్టిన శని ఈరోజుతో వదిలి పోయిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎల్.రమణను కాకుండా ఐరన్ లెగ్ రమణను పార్టీలో చేర్చుకుంటున్న కేసీఆర్ అంటూ రమణది ఐరన్ లెగ్ అని అభివర్ణించారు.ఇంత కాలం తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా లేకపోవడానికి రమణ నాయకత్వమే కారణమన్నారు. ఇక నూతన నాయకత్వంలో భవిష్యత్తులో పార్టీ మరింత బలోపేతం అవుతుందని జీవిజి నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రమణ వెళ్లిపోవడం శుభసూచకమని ఆయన అభిప్రాయపడ్డారు.
Recommended Video
తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రమణ తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. తనకు పదవులు కొత్త కాదని ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రి గా పని చేశానని ఆయన స్పష్టం చేశారు. రెండు మూడు రోజుల్లో టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన ఆయన ఎమ్మెల్సీ పదవి కోసమే టీఆర్ఎస్ లో చేరతానని చెప్పడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ నాయకత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎల్.రమణ స్పష్టం చేశారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ తో భేటీలో ఉప ఎన్నిక గురించి చర్చ జరగలేదని చెప్పిన రమణ, తాను అధికార పార్టీలో చేరుతుంది ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకే అంటూ మరోమారు తాను టిఆర్ఎస్ లో చేరుతున్న విషయాన్ని రమణ స్పష్టం చేశారు.