దేశ చరిత్రలో అరుదు.. గులాబీ నీడలో 50 లక్షల సభ్యత్వాలు.. కేటీఆర్ హర్షం
హైదరాబాద్ : తెలంగాణలో జోరు మీదున్న కారు.. క్యాడర్లో మరింత జోష్ పెంచుతోంది. ఎన్నికలు ఏవైనా విజయబావుటా ఎగురవేస్తున్న గులాబీ దండు సభ్యత్వ నమోదులోనూ ఔరా అనిపిస్తోంది. సంక్షేమ పథకాల అమలుతో దూసుకెళుతున్న టీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే చర్యలు సత్ఫలితాలు ఇచ్చినట్లేనని స్పష్టమవుతోంది.
టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై హర్షం వ్యక్తం చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అలియాస్ కేటీఆర్. నెల రోజుల వ్యవధిలో 50 లక్షల సభ్యత్వ నమోదు కావడం దేశ రాజకీయ చరిత్రలో అరుదని వ్యాఖ్యానించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై తెలంగాణ భవన్లో ఐదు గంటల పాటు సమీక్షా సమావేశం నిర్వహించిన కేటీఆర్ పార్టీ నేతలకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు.
మీ డబ్బులు జర భద్రం.. మహా కంత్రీగాళ్లు వచ్చేశారు.. ఫోన్ చేసి కొట్టేస్తున్నారు..!
టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఆగస్టు ఒకటవ తేదీ నుంచి బీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు కేటీఆర్. 70 వేలకు పైగా సభ్యత్వాలు నమోదు చేసిన ప్రాంతాల్లో గజ్వేల్, పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్లు ముందున్నాయని చెప్పారు. అదలావుంటే సభ్యత్వ నమోదు పూర్తయిన నియోజకవర్గాల్లో బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
జులై నెల ముగిసేలోగా సభ్యత్వ నమోదు పూర్తిచేయాలని పార్టీశ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు కేటీఆర్. ఇప్పటివరకు నియోజకవర్గాల వారీగా సభ్యత్వం ఎంతమేర నమోదైందనే విషయంపై ఆరా తీశారు. అదలావుంటే సభ్యత్వ రుసుం కింద 15 కోట్ల రూపాయలు పార్టీ ప్రధాన కార్యాలయానికి అందాయని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు.