లాక్ డౌన్ ఎఫెక్ట్ .. కొనసాగుతున్న సూపర్ మార్కెట్ల సీజ్ ... రీజన్ ఇదే
కరోనా లాక్ డౌన్ సూపర్ మార్కెట్ ల యజమానులకు తిప్పలు తెచ్చి పెట్టింది. సూపర్ మార్కెట్ లకు జనాలు గుంపులుగా వస్తున్న వేళ వారిని కట్టడి చేసి సామాజిక దూరం పాటించేలా చెయ్యాల్సిన బాధ్యత సూపర్ మార్కెట్ లదే అని చెప్పిన ప్రభుత్వం అలా పాటించని సూపర్ మార్కెట్ లను సీజ్ చేసే పనిలో పడింది . కరోనాపై పోరాటం చేస్తున్న నేపధ్యంలో కేవలం నిత్యావసరాలకు మాత్రమే ప్రజలు బయటకు వచ్చేలా ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలకు సడలింపు ఇచ్చాయి. ఇక ఈ క్రమంలో అక్కడ సామాజిక దూరం పాటించకపోవటం పెద్ద చిరాకుగా తయారైంది.
సోషల్ డిస్టెన్స్ పాటించని మరో సూపర్ మార్కెట్ సీజ్
దీంతో ఇప్పటికే సామాజిక దూరం పాటించలేదని ఎల్బి నగర్ లోని డిమార్ట్ సూపర్ మార్కెట్ అలాగే శ్రీనగర్ కాలనీలోని రత్న దీప్ సూపర్ మార్కెట్ ను జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సీజ్ చేశారు. ఇక తాజాగా ఈ రోజు చందానగర్ లో ఉన్న విజేత సూపర్ మార్కెట్, మధురా నగర్ లో ఉన్న వ్యాల్యూ మార్ట్ లను అధికారులు సీజ్ చేశారు. సూపర్ మార్కెట్ లో భౌతిక దూరం పాటించకుండా, ఒకేసారి ఎక్కువ మందిని లోపలికి పంపడం, ఒక్క దగ్గరే జనం గుంపులుగా ఉండటం వలన సీజ్ చేయడం జరిగిందని జిహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. వరుసగా సూపర్ మార్కెట్ లు సీజ్ అవుతున్నా సరే ప్రజల వైఖరిలో మాత్రం మార్పు లేదు. నెల రోజులకు పైగా ఇళ్లకే పరిమితం అవుతున్నా కరోనా మహమ్మారి సామాజిక దూరం పాటించకుంటే వచ్చే ప్రమాదం ఉందని చెప్పినా పట్టంపు లేదు .
ప్రజల్లో అవగాహన రానంత కాలం ప్రభుత్వాలు ఎంత కట్టడికి ప్రయత్నం చేస్తున్నా కరోనా మహమ్మారి నుండి బయట పడే అవకాశం లేదు . సాధ్యమైనంత సామాజిక దూరం పాటిస్తూ కొంత కాలం పాటు మనుగడ సాగిస్తే కరోనా నుండి బయట పడే అవకాశం ఉంది. ముఖ్యంగా నిత్యావసరాలు కొనుగోలు చేసే సమయంలో భౌతిక దూరం పాటించకపోతే అది సదరు సూపర్ మార్కెట్ ల వాళ్లకు , అలాగే మనకు కూడా ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. సమీపంలో ఉన్న సూపర్ మార్కెట్ లు బంద్ అయితే దూరం వెళ్లి మరీ సరుకులు తెచ్చుకోవటం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టం . కాబట్టి అధికారుల మాట విని సామాజిక దూరం పాటించాలి . ఇక సూపర్ మార్కెట్ ల వాళ్ళు కూడా సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఈ సీజ్ లు తప్పవు మరి.