ఎన్నికల్లో చెల్లని రూపాయిలెన్నో, పైసలెన్నో..! నేతల మధ్య హాట్ కామెంట్స్
హైదరాబాద్ : చెల్లని రూపాయిలంటూ అపొజిషన్ నేతలపై అధికార పార్టీ లీడర్లు సెటైర్లు వేస్తున్నారు. మీరే చెల్లని పైసలంటూ మాటల యుద్ధానికి దిగుతున్నారు ప్రతిపక్ష నేతలు. ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణల పర్వం తారాస్థాయికి చేరింది. నువ్వెంతంటే నువ్వెంత అనే రేంజ్ లో ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుతున్నారు.
ఎన్నికల గోల
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి చెల్లని రూపాయి గోల ఓటర్ల చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు కేటీఆర్, రేవంత్ రెడ్డి చెల్లని రూపాయి అస్త్రాన్ని బాగానే వాడుకున్నారు. కొడంగల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన పట్నం నరేందర్ రెడ్డిని చెల్లని రూపాయిగా అభివర్ణించారు రేవంత్ రెడ్డి. కోస్గి సంతలో చెల్లని రూపాయి కొడంగల్ లో చెల్లుతుందా అంటూ ప్రశ్నించారు. అలాగే కేటీఆర్ కూడా పలు సందర్భాల్లో కాంగ్రెస్ నేతలను చెల్లని రూపాయిగా తిట్టి పోశారు.
83 శాతం పట్టభద్రులు వ్యతిరేకించారు.. టీఆర్ఎస్కు ఇది గుణపాఠమే : జీవన్ రెడ్డి
రూపాయి లొల్లి
లోక్సభ ఎన్నికల వేళ మళ్లీ చెల్లని రూపాయి గోల మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నేతలు ఎంపీలుగా పోటీచేస్తుండటంతో.. కేటీఆర్ తనదైన శైలిలో మాటల యుద్ధం మొదలుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లని రూపాయిలు.. లోక్సభ ఎన్నికల్లో చెల్లుతాయా అంటూ వారినుద్దేశించి మాట్లాడుతున్నారు. అదేక్రమంలో నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఓడిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. భువనగిరి పార్లమెంట్ స్థానంలో గెలుస్తారా అంటూ ప్రచార సభల్లో ప్రశ్నిస్తున్నారు.
చెల్లని పైసలంటూ కౌంటర్
టీఆర్ఎస్ నేతల చెల్లని రూపాయిని దాటి మరో అడుగు ముందుకేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. గులాబీ వనంలో చెల్లని పైసలున్నాయంటూ వ్యాఖ్యానించారు. చెల్లని రూపాయిలంటూ కాంగ్రెస్ నేతల వైపు వేలు చూపేముందు గులాబీ నేతలు తమ చేతిని ఓసారి చూసుకోవాలని హితవు పలికారు.
కాంగ్రెస్ లీడర్లే టార్గెట్ గా చెల్లని రూపాయంటూ పదేపదే వల్లిస్తున్న టీఆర్ఎస్ నేతలు.. తమ పార్టీకి వర్తిస్తుందో లేదో కూడా క్రాస్ చెక్ చేసుకోవాలన్నారు. ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లని పైసలు లోక్సభ ఎన్నికల్లో ఎలా చెల్లుతాయంటూ ప్రశ్నించారు. చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో చెల్లని పైస (వెంకటేశ్ నేతకాని) పెద్దపల్లి పార్లమెంటరీ స్థానంలో ఎలా చెల్లుతుందని ధ్వజమెత్తారు. మొత్తానికి నేతల కామెంట్లు జనాల్లో చర్చానీయాంశంగా మారాయి. లోక్సభ ఎన్నికల్లో చెల్లని రూపాయిలెవరో, చెల్లని పైసలెవరో మరో 15 రోజుల్లో తేలిపోనుందని మాట్లాడుకుంటున్నారు.