కేంద్రంపై కేటీఆర్ కస్సు బస్సు.. ఆస్తుల అమ్మకం అంటూ ఆగ్రహాం..
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా ఉందన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించడం లేదని ఫైరయ్యారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అమ్ముకునే పనిలో మాత్రం బీజీగా ఉందని కేటీఆర్ విమర్శించారు. దేశాభివృద్ధి, ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నంలా నిలిచిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం అమ్ముతుందని మండిపడ్డారు.
హామీలు బుట్టదాఖలు
తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన ఎన్నో రాజ్యాంగబద్ద హామీల అమలును పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పెట్టబడులు ఉపసంహరించే పేరుతో నాటకాలు ఆడుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మవద్దని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్కు లేఖ రాశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీతోపాటు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయా సంస్థలను అమ్మడానికి బదులు పునః ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మరోసారి కేంద్రాన్ని కోరారు.
అప్పనంగా అమ్మడమే లక్ష్యం
తెలంగాణలో వ్యాపార వాణిజ్య, పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆయా సంస్థలను ప్రారంభించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచిన సంస్థలను అప్పనంగా అమ్మడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో ఉన్న హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెట్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, హెచ్ఎంటీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోడీ ప్రభుత్వం తన డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికల్లో భాగంగా అమ్ముతుందన్నారు. సుమారు 7200 ఎకరాల భూమిని కేటాయించాయనే కేటీఆర్.. ఇప్పుడు ఆ భూముల విలువ ప్రభుత్వ లెక్క ధరల ప్రకారం కనీసం 5 వేల కోట్ల రూపాయలపై ఉంటుందన్నారు.
రూ.40 వేల కోట్లు
బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం వాటి విలువ 40 వేల కోట్లు ఉంటుందని కేటీఆర్ తెలిపారు. స్థానిక ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించడంతోపాటు రాష్ట్రంలో పారిశ్రామికాభివృధ్ది జరగాలనే లక్ష్యంతో గతంలో ఆయా కంపెనీలకు అత్యంత తక్కువ ధరకు, అనేక సందర్భాల్లో ఉచితంగా భూములు కేటాయించిన సంగతిని కేటీఆర్ గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం అమ్మాలనుకుంటున్న ప్రభుత్వ రంగ సంస్థల భౌతిక ఆస్తులను తెలంగాణ ప్రజల హక్కుగానే తమ ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు. తమిళనాడుతో పాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ భూభాగంలో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను అమ్మే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో PSUల అమ్మకంపై పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా కొనసాగిన ఆయా సంస్థలను అమ్మడానికి బదులు పునరుద్దరణ చేపట్టి వాటిని బలోపేతం చేయాలని సూచించారు.