సమ్మె నివారణ బాధ్యత మంత్రులకు లేదా: అధికారులు విఫలమయ్యారు: ట్రబుల్ షూటర్లు ఏమయ్యారు..!
అసలే పండుగల సమయం. అందునా దసరా. వరుస సెలవులు. అనివార్యంగా మారుతున్న ఆర్టీసి సమ్మె. అనేక విడతలుగా ఆర్టీసి కార్మిక సంఘాలతో అధికారుల కమిటీ చర్చలు. ఫలితం శూన్యం. సమ్మెకు వెళ్తే వేటు వేస్తామని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరిక. లెక్క చేయని కార్మిక సంఘాలు. ఇష్టానుసారం ధరలు పెంచేస్తున్న ప్రయివేటు ఆపరేటర్లు. రైళ్లల్లో దొరకని సీట్లు. తెలంగాణ ప్రాంతంలో దసరా పండుగ అతి పెద్దది. ఘనంగా జరుపుకొనే ఆనవాయితీ. ఇటువంటి సమయంలో ఆర్టీసి సంఘాలు సమ్మెకు నోటీసు ఇచ్చాయి. ప్రభుత్వం అధికారులతో కమిటీ వేసింది. వారు చర్చలు చేసారు. ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. వారి వైఖరి నచ్చటం లేదంటూ..మొట్టు దిగని కార్మిక సంఘాలు. వారికి మద్దతుగా ప్రతిపక్షాలు. ప్రభుత్వం ఈ ఆర్టీసీ సమ్మెను సీరియస్ గా తీసుకోవటం లేదా. మరి..అధికారుల స్థాయిలో విఫలమయినప్పుడు మంత్రులను ఎందుకు రంగంలోకి దించటం లేదు. ప్రభుత్వంలోని ట్రబుల్ షూటర్లు ఏమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం..ఆర్టీసి మధ్య అసలు ఏం జరుగుతోంది.
మరో'సారీ’ జేఏసీ నేతలతో ఐఏఎస్ కమిటీ చర్చలు విఫలం, అర్ధరాత్రి నుంచి సమ్మె
పండుగ వేల ప్రయాణీకుల పైన సమ్మె పోటు..
ఆర్టీసీ కార్మిక సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం సరిగ్గా సమయం చూసి ఒత్తిడి పెంచే కార్యక్రమం మొదలు పెట్టారు. పండుగ రోజుల్లో సమ్మెకు వెళ్తున్నట్లు నోటీసు ఇచ్చారు. ఆ తరువాత సమావేశమైన తెలంగాణ కేబినెట్ వారి డిమాండ్ల పై చర్చల కోసం ముగ్గురు ఐఏయస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. వారు పలు ధపాలుగా చర్చలు చేసారు. అయినా కార్మిక సంఘాలు మెట్టు దిగటం లేదు. ఫలితం గా ఇప్పటికే ప్రయివేటు ఆపరేటర్లు ధరలు పెంచేసారు. కొన్ని చోట్ల ఇప్పటికే సమ్మె ప్రభావం ప్రారంభమైంది. పండుగ రోజుల్లో సమ్మె కొనసాగితే..తెలంగాణ ప్రాంతంలో ఘనంగా జరుపుకొనే దసరాకు సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వం ఈ సమస్యను అంచనా వేయలేక పోయిందా..లేక కార్మిక సంఘాలు దిగి వస్తాయనే ధీమాతో ఉందా.
సమ్మెకు దిగితే వేటు హెచ్చరిక..
సమ్మె విరమించుకోవాలంటూ కమిటీ అధికారులు కోరగా... డిమాండ్లపై స్పష్టత వస్తేనే విరమించుకుంటామని జేఏసీ నేతలు చెప్పారు. ఇరు వర్గాలు బెట్టు వీడక పోవడంతో చర్చలు ఫలప్రదం కాలేదు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతో పాటు 26 డిమాండ్లను పరిష్కరించాలంటూ కార్మిక సంఘాల జేఏసీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. డిమాండ్లపై సానుకూల పరిశీలన చేస్తామని..30 రోజుల్లో సర్కారుకు నివేదిక ఇస్తామంటూ త్రిసభ్య కమిటీ హామీ ఇచ్చింది. అవసరమైతే ఈ మేరకు లిఖితపూర్వకంగా హామీ ఇస్తామంటూ త్రిసభ్య కమిటీ ప్రకటించింది. అయినా..కార్మిక సంఘాలు మెట్టు దిగకపోవటంతో సమ్మెకు వెళ్లిన వారిని డిస్మిస్ చేస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పైనే ఫోకస్..
కార్మిక సంఘాలతో ఇక చర్చలు విఫలమయినట్లుగానే అధికారులు తేల్చేసారు. కార్మిక సంఘాలు సైతం సమ్మెను సక్సెస్ చేయటం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. మధ్యలో సాధారణ ప్రజల అంశాన్ని మాత్రం ఎవరూ ఆలోచన చేయటం లేదు. తాత్కాలిక పద్దితిన సిబ్బందిని నియమించుకోవాలని ఆర్టీసి నిర్ణయించింది. డ్రైవింగ్ లో అనుభవం ఉన్న వారిని ఆహ్వనిస్తోంది. స్కూల్ బస్సులను వినియోగించు కోవాలని డిసైడ్ అయింది. రోజు వారీ వేతనం ఇస్తామని ప్రకటన చేసింది. సమ్మెకు వెళ్లకుండా డ్యూటీలు చేసే వారికి పోలీసుల రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది. బస్సులకు సైతం రక్షణ ఇస్తామని చెబుతోంది. ప్రభుత్వం సైతం మెట్రో రైల్ సేవలను పొడిగించాలని కోరింది. ఏవి చేసినా..ఆర్టీసి సమ్మె ప్రభావం ఖచ్చితంగా సాధారణ ప్రయాణీకుల మీద ఉంటుంది.
అధికారులు ఫెయిల్.. ట్రబుల్ షూటర్లు ఎక్కడ
ఇటువంటి సందర్భాల్లో చివరి నిమిషం వరకు కార్మిక సంఘాలు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచటం సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే..ఇప్పుడు పరిస్థితి అధికారుల చేయి దాటిపోయింది. సమ్మెకు దిగితే ప్రత్నామ్నాయ ఏర్పాట్ల పైన ఫోకస్ చేసిన రవాణా శాఖ మంత్రి అజయ్ సమ్మె నివారణ అంశంలో దూరంగా ఉంటూ..అధికారులకు సూచనలు మాత్రం చేస్తున్నారు. సకల జనుల సమ్మెలో అసలు తెలంగాణ ఆర్టీసి ఏర్పాటులో ఇప్పుడు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నవారే కీలక పాత్ర పోషించారు. వారి ఆశీస్సులతో నాయకులైన వారే ఇప్పుడు ప్రభుత్వం సూచించినా మాట వినటం లేదు. మరి..అధికారులు విఫలమైన సమయంలో..ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేని వేళ..ప్రభుత్వంలోని ట్రబుల్ షూటర్స్ ఎందుకు జోక్యం చేసుకోవటం లేదు. కార్మిక సంఘాల డిమాండ్లకు తలొంచక పోయినా..వారితో మంత్రుల స్థాయిలో చర్చలు చేస్తే సానుకూల ఫలితాలకు అవకాశం ఉంటుంది. కానీ, ఆ ప్రయత్నాలు జరగటం లేదు. ఇప్పుడు..మరి కొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. మరి..ఇప్పటికైనా ప్రభుత్వంలోని ట్రబుల్ షూటర్స్ బయటకు వస్తారా..ప్రయాణీలకుకు ట్రబుల్స్ లేకుండా చేస్తారా..చూడాలి మరి ఏం జరుగుతోందో..