అన్ని రంగాల్లో రాణించాలి.!అప్పుడే మహిళా సాధికారత సాద్యమన్న మేయర్ విజయలక్ష్మి.!
హైదరాబాద్ : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ది సాధించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. గురువారం మేయర్ ఛాంబర్ లో బ్రిటీష్ డిప్యూటి హై కమీషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బృందంతో ఏర్పాటైన మహిళా సాధికారత అంశంపై మేయర్ విజయలక్ష్మిమాట్లాడుతూ మహిళలను వివిధ అంశాలపై చైతన్యపరిచి సమాజంలో ఎదురవుతున్న సమస్యలపై స్పందించేందుకు ముందుకురావాలన్నారు. మహిళలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి.
అన్ని రంగాల్లో పూర్తి స్వేచ్ఛ.. మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్న మేయర్
మహిళలకు అన్ని రంగాల్లో పూర్తి స్వేచ్ఛను ఇచ్చి వారిని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే విధంగా కృషిచేస్తామన్నారు జీహెచ్ఎంసీ మేయర్. మహిళలకు ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా పూర్తి చేయూతను అందిస్తున్నదని అన్నారు. నగరవ్యాప్తంగా ఉన్న పేద పిల్లలను పాఠశాలల్లో చేర్పించి ఉచితంగా పుస్తకాలు, పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. కోవిడ్-19 సమయంలో నగరంలో నిరుపేదలకు, నిరాశ్రయులకు నిరంతరాయంగా ఆహారం, షెల్టర్ కల్పించడం జరుగుతుందని, ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన కుటుంబాలకు నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మేయర్ విజయ లక్ష్మి.
మహిళల సృజనాత్మకతకు కొదవ లేదు.. అద్బుతంగా రాణిస్తున్నారన్న జీహెచ్ఎంసీ మేయర్
మహిళలు మగవారికంటే కొన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని వారు ప్రస్తుత పరిస్థితుల్లో సృజనాత్మకత, కొత్త ఆలోచనలతో సమాజంలో ముందుకు వెళ్తున్నారని ప్రశంసించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి స్వయం సహాయక సంఘాల ద్వారా సాధికారత సాధించేందుకు ప్రభుత్వం విశేష కృషిచేస్తున్నదని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు.
మహిళా సాధికారిత దిశగా అడుగులు.. అవకాశాలు కల్పించాలన్న బ్రిటీష్ డిప్యూటి హై కమీషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్
ఈ సందర్భంగా బ్రిటీష్ డిప్యూటి హై కమీషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మాట్లాడుతూ, మహిళలు చదువు, ఉద్యోగం, ఆర్థికంగా వంద శాతం ముందంజలో ఉండాలన్నారు. మహిళలు తమ పిల్లలను చదివించడం ద్వారా సమాజంలో మార్పు వస్తుందన్నారు. మహిళలపై ఎటువంటి అసాంఘిక చర్యలు జరుగకుండా వారికి సామాజికంగా భద్రత కల్పించాలన్నారు. మహిళలందరూ తమ ఓటు హక్కు ద్వారా సరైన నాయకులను ఎంపిక చేసుకోవాలని, వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
Recommended Video
మహిళా సాధికారత పై జిహెచ్ఎంసిలో సమీక్ష.. పాల్గొన్న బ్రిటీష్ డిప్యూటి హై కమీషనర్
నేడు డిప్యూటి హై కమిషనర్ గా వ్యవహరించిన కత్రీన్ కరొన్య మేయర్ గద్వాల విజయలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసి మహిళా సాధికారత పై జిహెచ్ఎంసిలో చేపడుతున్న చర్యలను మేయర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పొలిటికల్ అడ్వైజర్ నలిని, సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ, భరత్ నగర్ కార్పొరేటర్ సింధు, గన్ ఫౌండ్రీ మాజి కార్పొరేటర్ మమతసంతోష్ గుప్తా లు పాల్గొన్నారు.