8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు, తెలంగాణ పత్తికి అంతర్జాతీయ ఖ్యాతి: సీఎం కేసీఆర్
తెలంగాణలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 4,800 కోట్ల వ్యయంతో చేపట్టే ఆయిల్పామ్ పంట విస్తరణ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఆమోదించారు. రైతులకు 50 శాతం సబ్సిడీ ఇచ్చి ఆయిల్పామ్ సాగు చేయిస్తామని ఆయన వెల్లడించారు. సాగునీటి వసతి కలిగిన ప్రాంతాల్లోనే ఆయిల్పామ్ సాగు చేయడం సాధ్యమవుతుందన్న ఆయన.. రాష్ట్రంలో పెరిగిన సాగునీటి వసతి నిరంతర విద్యుత్ సరఫరా వల్ల ఆ సదుపాయాన్ని రైతులు ఉపయోగించుకోవాలని కోరారు.
25 జిల్లాలను ఆయిల్పామ్ సాగుకు అనువైనవిగా నేషనల్ రీ అసెస్మెంట్ కమిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంచే విధానంపై ప్రగతి భవన్లో సీఎం సమీక్షించారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, కార్యదర్శి జనార్ధన్రెడ్డి, హార్టికల్చర్ కార్పొరేషన్ ఎండి వెంకట్రామిరెడ్డి, సీడ్ కార్పొరేషన్ ఎండి కేశవులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో పండే పత్తి దేశంలో అత్యంత నాణ్యమైనదిగా గుర్తింపు పొందిందని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో పండే పత్తి స్టేపుల్ పొడవు దేశంలో పొడవుగా వస్తుందని, గట్టిగా కూడా ఎక్కువని సీఎం అన్నారు. నాణ్యతతో కూడిన తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ కల్పించేందుకు ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ పత్తికున్న విశిష్ట లక్షణాలను గుర్తించి, వాటిని ప్రచారం చేయడానికి అవసరమైన వ్యూహం రూపొందించాలని కోరారు. దీని కోసం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిపుణులతో ఓ సదస్సు నిర్వహించాలని సీఎం చెప్పారు. పత్తిలో చెత్తా చెదారం, మట్టి పెళ్లలు, దుమ్ముచేరకుండా చూడాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎక్కువ కడుతున్నందున సాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కాల్వల కింద పత్తిని సాగుచేస్తే మరింత లాభసాటిగా ఉంటుంది అని సీఎం కేసీఆర్ అన్నారు. పత్తికి మించి మార్కెట్ రావడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు.












Click it and Unblock the Notifications