సుముఖంగా లేరు.. అయినా ప్రయత్నిస్తాం: కేసీఆర్ సహా నేతలపై పవన్ కళ్యాణ్
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయమై మాట్లాడేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గానీ, పెద్దలు కే కేశవరావు గానీ, మంత్రులు కేటీ రామారావు, ఇతరులు సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు హైదరాబాద్లోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి తనను కలిసినట్లు చెప్పారు.
పవన్ కళ్యాణ్ను కలిసిన కార్మికులు
సమ్మె సందర్భంగా ప్రభుత్వంతో ప్రారంభించిన చర్చలు పీటముడిగా మారిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు పవన్ తెలిపారు. దాదాపు గత 30 రోజులుగా సమ్మెలో ఉన్నా ప్రభుత్వం వైపు నుంచి సరైన స్పందన కనబడటం లేదని బాధను వ్యక్తం చేశారని చెప్పారు.

కేసీఆర్ సహా నేతలు సుముఖంగా లేకపోయినా..
సమ్మె సమస్య పరిష్కారంలో జోక్యం చేసుకోవాలని తనను కోరినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్, కేశవరావు, కొందరు మంత్రులను తాను కలవడానికి సమయం కోసం జనసేన పార్టీ ప్రతినిధులు ప్రయత్నం చేశారని చెప్పారు. అయితే, దీనిపై మాట్లాడేందుకు వారు ఎవరూ ఎందుకోగానీ సంసిద్ధంగా లేరని అన్నారు.
అందువల్ల వారిని తాను కలవలేకపోయానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

మరో ప్రయత్నం చేస్తా...
విశాఖపట్నంలో నవంబర్ 3న లాంగ్ మార్చ్ నిర్వహణలో భాగంగా తాను ఆ కార్యక్రమానికి వెళ్లవలసి రావడంతో కేసీఆర్ని కలిసే ప్రయత్నాన్ని విశాఖ నుంచి వచ్చిన తర్వాత మరోసారి చేస్తానని ఆయన తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు వారికి అండగా ఉంటానని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

28రోజులుగా కొనసాగుతున్న సమ్మె
ఇది ఇలా ఉండగా, సమ్మె కొనసాగుతున్న క్రమంలో ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల బలవన్మరణాలు కొనసాగుతున్నాయి. గత 28వ రోజులుగా సమ్మె చేయడంతో కార్మికులు ఊపిరి తీసుకుంటున్నారు. ఇప్పటికే 17 మంది డ్రైవర్లు, కండక్టర్లు చనిపోయారు. గురువారం సాయంత్రం ప్రకాశ్ అనే కండక్టర్ కూడా గుండెపోటుతో నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం మరో డ్రైవర్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. కార్మికుల ఆత్మహత్యలు కలవరానికి గురిచేస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ డిపోకు చెందిన తాత్కాలిక డ్రైవర్ ఖాజా ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందుతాగాడు. వెంటనే అతనిని సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఖాజాకు చికిత్స అందిస్తున్నారు. ఖాజా స్వస్థలం నాగర్ కర్నూలు కాగా.. షాద్ నగర్ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఆత్మహత్య చేసుకుంటుండగా.. తాత్కాలిక డ్రైవర్ కూడా ఆత్మహత్యాయత్నం చేయడం చర్చనీయాంశమైంది. కాగా, హైదరాబాద్లో జరిగిన సకల జనుల సమరభేరీలో పాల్గొన్న అనంతరం కరీంనగర్ కు చెందిన బాబు అనే డ్రైవర్ గుండె పోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో రాజకీయా పార్టీలు, ఆర్టీసీ కార్మికులు కరీంనగర్లో బంద్ నిర్వహించి, భారీ నిరసనల చేపట్టారు.












Click it and Unblock the Notifications