ప్రియాంకా రెడ్డి హత్య ఎఫెక్ట్: మహిళలకు రోడ్లపై ఏ ఇబ్బంది ఉన్నా 100 కు కాల్ చెయ్యండి : డీజీపీ
వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకా రెడ్డి దారుణ హత్య ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. మహిళలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా, ఏ సమయంలో అయినా సరే పోలీసులు మీకు అండగా ఉంటారు అంటూ భరోసా ఇస్తున్నారు . ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా 100 నెంబర్ కు డయల్ చేయాలని మహిళలకు సూచిస్తున్నారు.
ప్రియాంకా రెడ్డి హత్యతో హైవేల మీద, రోడ్ల మీద మహిళలకు భద్రత లేదన్న భావన
ప్రియాంక రెడ్డి దారుణహత్య ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది అన్న భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా హైవేల మీద, రోడ్లపైన మహిళలకు రక్షణ లేదు అనడానికి ప్రియాంక రెడ్డి రేప్, హత్య ఒక ఉదాహరణ అని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే మహిళలకు రక్షణ కలిగించడానికి పోలీసులు అహర్నిశలు పనిచేస్తారని పోలీస్ శాఖ మహిళలకు భరోసా ఇస్తుంది.
రాత్రి సమయాలలో వాహనాలు రిపేర్ అయినా 100 కు కాల్ చెయ్యాలని సూచన చేసిన డీజీపీ
ఇక ఈ విషయంలో డీజీపీ మహేందర్ రెడ్డి పలు సూచనలు చేశారు. రాత్రివేళ ప్రయాణాల్లో మహిళలు, వృద్ధులు తమ వాహనాలు చెడిపోయినప్పుడు,ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రాత్రివేళల్లో ముప్పు పొంచి వుందనుకున్నప్పుడు 100 కు గానీ , 9490617111 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా షీ టీమ్స్ వాట్సాప్ నంబర్లు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు డీజీపీ మహేందర్ రెడ్డి .
మహిళల రక్షణ మా బాధ్యత అంటూ సూచనలు చేసిన రాచకొండ సీపీ
రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కూడా మహిళల రక్షణ బాధ్యత అంటూ పలు సూచనలు చేశారు. ప్రమాదంలో ఉన్న మహిళలు 100కు కాల్ చేసి సమాచారం అందించవచ్చని పేర్కొన్నారు. షీ టీమ్స్ ల్యాండ్ లైన్ నంబరు 040-2785 2355, వాట్సాప్ నంబరు 9490616555కు సమాచారం ఇచ్చినా వారు వెంటనే సాయం అందిస్తారని తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయని 112, 1090, 1091 నంబర్లకు కూడా అత్యవసర సమయంలో ఫోన్ చేసి సాయం కోరవచ్చు అని పోలీసులు పేర్కొన్నారు.
Recommended Video
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో స్పందించిన పోలీసులు .. మహిళల రక్షణకు చర్యలు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పోలీసులు మహిళలకు రోడ్లపైన రాత్రి వేళల్లో గాని, ఎలాంటి సందర్భంలో అయినా ఇబ్బంది తలెత్తితే, ఏదైనా ప్రమాదం పొంచి ఉందని భావిస్తే వెంటనే 100 కు డయల్ చేయాలని పోలీసులు మీకు కావాల్సిన సహాయాన్ని అందిస్తారని సోషల్ మీడియా ద్వారా పోలీస్ శాఖ ప్రచారం చేస్తుంది. ప్రియాంక రెడ్డి హత్య ఘటన నేపథ్యంలోనే ఎలాంటి సమయంలోనైనా మహిళలకు రక్షణ కల్పించాలని నిర్ణయం తీసుకున్న పోలీస్ శాఖ మహిళల రక్షణకు మేమున్నాము అని చెబుతోంది.